రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. జనాలు వేడి తీవ్రతకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. ఇక తాగేందుకు నీరు దొరక్క కొన్ని ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండకు అలసి సొలసి ఉంది సేద తీర్చుకొనేందుకు సాయం వేళల్లో చల్లని బీరు తాగుదామంటే అది కూదా దొరకడం చాలా కష్టమవుతుంది.
ప్రస్తుతం వేసవిలో తీవ్రమైన నీటి కొరత కారణంగా తెలంగాణలో బీరు ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఇలాంటి పరిస్థితులు టిప్పర్ల యాజమాన్యాలు, డ్రైవర్లను నిరాశపరిచింది. ఉపాధి లేక విలవిలబోతున్నారు కార్మికులు. ఇదిలా ఉంటే మందుబాబులకు కూడా బీరు ఉత్పత్తి తీవ్ర నిరాశను మిగిల్చింది.
వేసవి భానుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఒకవైపు వర్షాలు కురిసే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లగా బీరు తాగి సేదతీరుదామనుకునే వారికి చేదు వార్త అనే చెప్పాలి. బీరు సరఫరా కోసం పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నీరు సరిపోలడం లేదు.
నీటి కొరత కారణంగా మరో రెండు నెలల్లో బీరు ఉత్పత్తి తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా గండిపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో మైక్రోబ్రూవరీలకు భారీగా అనుమతులు లభించాయి. బీర్ల తయారీ ప్రక్రియ స్థానికంగానే సాగుతూ వచ్చేది. అయితే ప్రస్తుతం నీటి కొరతతో గ్రామీణ ప్రాంతాలకు బీర్ల సరఫరా తగ్గింది. బీరు తయారీలో ఎన్నడూ లేని విధంగా నీటి కొరత గడచిన నాలుగేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో ఉందని ఉపాధి కోల్పోయిన బాధితులు చెబుతున్నారునగరం చుట్టూ ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడం వల్ల బీరు ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
ఇంతకుముందు 1999లో ఒకసారి ఇటువంటి నీటి కొరత ఏర్పడింది. అయితే ఇది కొంత కాలం మాత్రమే ఉందని చెబుతున్నారు నిర్వహకులు. రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సింగూర్ జలాశయం నుండి నాలుగు బీరు తయారీ పరిశ్రమలకు నామమాత్రపు ధరకు 44 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నుంచి తాగునీటి కేటాయింపులు సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం సింగూర్ ప్రజల దాహార్తిని తీర్చకుండా బ్రూవరీలకు నీటిని ఎలా సరఫరా చేస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజలకే తాగేందుకు నీరు లేని పక్షంలో బీరు తయారీ పరిశ్రమలకు నీటిని ఎలా సరఫరా చేస్తారని కొందరు చర్చించుకుంటున్నారు. అందుకే బీరు ఉత్పత్తి చేసే పరిశ్రమలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
కరువు, తాగునీటి ఎద్దడి కారణంగా సింగూరు, మంజీర రిజర్వాయర్లలో నీటిమట్టం మరింత తగ్గుముఖం పట్టింది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ప్రయివేటు వనరుల నుంచి నీటిని సేకరించడం కష్టంగా ఉంది. అందువల్ల, SAB మిల్లర్ ఇండియా, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్బర్డ్ ఇండియా, క్రౌన్ బీర్స్లకు నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో బీర్ల ఉత్పత్తి తగ్గిపోయింది.