
- రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య
- మార్చి, ఏప్రిల్ నెలల్లో రెట్టింపు
- గాంధీ, ఉస్మానియా, నిమ్స్కు క్యూ కడుతున్న బాధితులు
- గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు
- నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని డాక్టర్ల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కిడ్నీల్లో రాళ్ల సమస్య కేసులు పెరుగుతున్నాయి. సమ్మర్ లో డీహైడ్రేషన్ వల్ల ఈ సమస్య తీవ్రం అవుతున్నది. గత చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్ ఆస్పత్రులకు కిడ్నీ సమస్యలతో ప్రజలు క్యూ కడుతున్నారు. హైదరాబాద్సిటీలో ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లోని యూరాలజీ డిపార్ట్మెంట్లలో కిడ్నీలలో రాళ్ల కేసులు గతంలో కంటే సమ్మర్ ప్రారంభమయిన తరువాత పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నట్టు చెప్పారు.
మున్ముందు ఎండలు ముదురుతాయని, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలో కిడ్నీల్లో రాళ్ల సమస్య అంటే ముప్పై ఏండ్లకు పైబడిన వారికి మాత్రమే అధికంగా వచ్చేది. ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారిలో రాళ్ల సమస్య వస్తున్నట్టు డాక్టర్లు పేర్కొంటున్నారు. సమ్మర్ లో టెంపరేచర్లు పెరగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుందని, తద్వారా మూత్రం గాఢంగా మారి ఖనిజాలు (కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటివి) రాళ్లుగా ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఫ్యూచర్ లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.
పిల్లల కిడ్నీల్లోనూ రాళ్లు..
గతంలో కిడ్నీ స్టోన్స్ సమస్య పెద్దవారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ, ఇప్పుడు పిల్లలు, యువతలోనూ ఈ సమస్య విస్తరిస్తోంది. జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్, సమయానికి నీళ్లు తాగకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వంటివి పిల్లల్లో ఈ సమస్యకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా 10 నుంచి -17 ఏండ్ల పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ సమస్యలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పదేండ్ల క్రితం వరకు కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా అరుదుగా ఉండేదని, మారిన జీవన విధానం వల్ల ఇటీవలి కాలంలో కేసుల సంఖ్య పెరుగుతున్నదని డాక్టర్లు పేర్కొంటున్నారు.
సరిపడా నీళ్లు తాగకపోతే కిడ్నీలకు ముప్పే..
మారిన జీవనశైలీలో కిడ్నీ సంబంధిత సమస్యలు తీవ్రం అవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అధిక ఉప్పు వినియోగం, జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం, వంశపారంపర్య కారణాలు, వృత్తిపరమైన ఒత్తిడి కిడ్నీల సమస్యకు దారి తీస్తాయని పేర్కొంటున్నారు. రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని, మూత్రం లేత పసుపు రంగులో లేదా నీటిలా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్, మీట్, షుగర్ డ్రింక్స్ మానేయాలని, పండ్లు (వాటర్మెలన్, కొబ్బరి నీళ్లు), కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలు (బీట్రూట్, పాలకూర, టమాటో) తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లు అనుమానం ఉంటే రెగ్యులర్ చెకప్లు చేయించుకోవాలని సూచిస్తున్నారు. చిన్న రాళ్లు (5 మి.మీ. కంటే తక్కువ) సాధారణంగా మూత్రం ద్వారా వెళ్లిపోతాయని, పెద్ద రాళ్లకు ట్రీట్మెంట్అవసరని పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం..
చాలామంది కిడ్నీలలో రాళ్లను నిర్లక్ష్యం చేస్తారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే రాళ్లు కిడ్నీలను దెబ్బతీస్తాయి. కిడ్నీలు ఫెయిల్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. కిడ్నీలో రాళ్లను తీసివేయడం అంటే కిడ్నీలను కాపాడుకోవడమే. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నాం. అందరికీ సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమందిలో మందులతో కూడా రాళ్లను కరిగించే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ కు చూయించుకోవాలి.
- డాక్టర్ రవిచందర్, యూరాలజీ హెచ్వో డీ, గాంధీ ఆస్పత్రి