సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో చెరువు, కుంటలు కనుమరుగవుతున్నాయి. ఇదే అదునుగా కొందరు రూ.కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేస్తున్నారు. ఎకరాల కొద్దీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కొన్నేండ్లుగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మాయమవుతున్న ఎఫ్టీఎల్జాగల తతంగంలో కొందరు ఇరిగేషన్ ఆఫీసర్ల చేతివాటం ఉందనే చర్చ నడుస్తోంది. విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాలు కావడంతోపాటు భవిష్యత్తరాలను సమస్యల వలయంలోకి నెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట పరిధిలోని నక్కలపాడు కుంట అలియాస్ దూదేకుల కుంట ఎఫ్టీఎల్ లిమిట్ను ఇరిగేషన్అధికారులు పూర్తిగా మార్చేశారు. సర్వే నంబర్ 131, 132 లో ఉన్న దాదాపు 30 గుంటల భూమిని ఎఫ్టీఎల్లో ఉన్నట్లుగా హెచ్ఎండీఏ గుర్తించింది. అయినా కొందరు లోకల్ఇరిగేషన్ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎఫ్టీఎల్లో ఉన్న సదరు భూములకు ఎన్వోసీలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హెచ్ఎండీఏ రిపోర్ట్ ఆధారంగా అక్కడ నిర్మాణాలకు ఇచ్చిన పర్మిషన్లను గతంలో గ్రామ పంచాయతీ రద్దు చేసినా ఇప్పుడు తప్పుడు ఎన్వోసీతో యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధంకొమ్ము చెరువు, పరీవాహాక ప్రాంతాలు, కాల్వలు, ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో వాటి స్వరూపాన్ని కోల్పోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన కూడా చేయకుండా బంధంకొమ్ము ఎఫ్టీఎల్కు క్లియరెన్స్ ఇచ్చి జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 276, 277, 314, 315 లోని ఇన్ ఫ్లో కాల్వలను ఓ కన్స్ర్టక్షన్స్ సంస్థ, అలాగే సర్వే నంబర్లు 469, 470, 475 లో ఉన్న అవుట్ ఫ్లో కాల్వలను మరో కన్స్ర్టక్షన్ సంస్థ పూర్తిగా ఆక్రమించిన వ్యవహారంలో కొందరి ఇరిగేషన్ అధికారులదే కీలక పాత్ర ఉన్నట్లు సమాచారం. మరోవైపు బంధంకొమ్ము ఎఫ్టీఎల్ను దాదాపు రెండకరాల మేర ఆక్రమించి నిర్మించిన ఇళ్లకు కూడా ఆ ఆఫీసర్లే ఎన్వోసీలు ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది.
హెచ్ఎండీఏ మ్యాప్లను లెక్కచేయట్లే..
అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలోని పటేల్ చెరువు బఫర్ జోన్ వ్యవహారంలో హెచ్ఎండీఏ అధికారులు ఫైనల్ చేసిన మ్యాప్ను లోకల్ ఇరిగేషన్ శాఖ పూర్తిగా మార్చివేసిందనే విమర్శలు ఉన్నాయి. చెరువు చుట్టూ బఫర్ జోన్ను 30 మీటర్లుగా హెచ్ఎండీఏ గుర్తిస్తే, స్థానిక ఇరిగేషన్ అధికారులు దానిని 10 మీటర్లకు కుదించి అక్రమార్కులకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దానికి ఎన్వోసీలు కూడా జారీ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 993/40లో లేని చెరువును సృష్టించిన ఘనత ఇక్కడి ఇరిగేషన్ అధికారులకే దక్కిందని మండిపడుతున్నారు. 2014 వరకు లేని చెరువును తీసుకొచ్చి అక్కడ బీహెచ్ఈఎల్ లేక్ ఉన్నట్లు ఇష్టానుసారం నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి 1970 లో స్థలాలు పొందిన పేదలకు అన్యాయం జరుగుతోందంటున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం..
ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటించి బౌండరీస్ ఫిక్స్ చేస్తాం. తమ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తున్నాం. ఇరిగేషన్ శాఖ నుంచి జారీ చేసిన ఎన్వోసీలను మరోసారి పరిశీలిస్తాం. చెరువులు, కుంటలు కబ్జాలు కాకుండా ఇప్పటికే పరిధులు ఏర్పాటు చేశాం.
- ప్రసాద్, ఏఈ, ఇరిగేషన్, అమీన్పూర్