తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భూముల కేటాయింపుల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అందజేసింది. రంగారెడ్డి కలెక్టర్​తో పాటు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్​కు చెందిన మ్యూచువల్లీ ఎయిడెడ్  కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 2010లో అప్పటి ప్రభుత్వం విలువైన భూములను కేటాయించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం నెక్నాంపూర్​లో 55 ఎకరాలు, శామీర్ పేట మండలం జవహర్​నగర్​లో 100 ఎకరాలు ఇచ్చింది. జీవో 509, 510లను జారీ చేసింది. ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ ఓమిమ్ దేబర, మరొకరు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయగా తుది తీర్పు వెలువడింది. 

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఓమిమ్ దేబర సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్​ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర దత్తాతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా భూములను కేటాయించారని తెలిపారు. కేటాయింపులు జరిపే నాటికి భూముల విలువ రూ.525 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. కానీ, ఎకరాకు రూ.2 లక్షల చొప్పున మొత్తంగా రూ.3.110 కోట్లకు ప్రభుత్వం ఈ భూములు కట్టబెట్టిందని వెల్లడించారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు బీపీఎల్ కిందకు రారని వాదించారు.