
హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీకి సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (83) భౌతికకాయాన్ని అప్పగించారు. అనాటమీ విభాగానికి సురవరం పార్థీవదేహాన్ని ఆయన కుటుంబం డొనేట్ చేసింది. సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర ఆదివారం హైదరాబాద్లో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. సురవరం సుధాకర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే.
కాగా, ఆదివారం ఉదయం 9 గంటలకు సుధాకర్రెడ్డి పార్థివదేహాన్ని గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ నుంచి హిమాయత్నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూంభవన్కు తరలించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు, ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు.
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వామపక్ష, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు శ్రేయోభిలాషులు సుధాకర్రెడ్డికి నివాళి అర్పించారు. ఆ తర్వాత అధికారిక లాంఛనాలతో ర్యాలీగా తీసుకెళ్లి గాంధీ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశోధన కోసం సుధాకర్రెడ్డి పార్థివదేహాన్ని అప్పగించారు.
సురవరం అంతిమ యాత్రకు అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎర్ర చొక్కాలు, మహిళలు ఎర్రచీరలు ధరించి భారీగా హాజరయ్యారు. అన్ని రాజకీయ పార్టీల అభిమానాన్ని, అందరి ప్రేమను పొందిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ నాయకులు కొనియాడారు.