
- నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువైన ఇంజిన్ ఆయిల్, టొయోటా కారు స్వాధీనం
సూర్యాపేట, వెలుగు : నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కె.నరసింహ నిందితుడి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన కాకాని నాగ వెంకటేశ్వరరావు మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు.1998 నుంచి కొంతకాలం విజయవాడలోని ఓ ఇంజిన్ ఆయిల్ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశాడు. అయితే ఇంజిన్ ఆయిల్ తయారీలో అనుభవం వచ్చిన వెంకటేశ్వరరావు సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో నకిలీ ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చి బ్రాండెడ్ కంపెనీ స్టిక్కర్లు వేసి అమ్మాలని ప్లాన్వేశాడు. బైక్ మెకానిక్స్కు తక్కువ ధరకు ఆయిల్ సరఫరా చేయాలని అనుకున్నాడు.
కోల్కత్తా నుంచి క్యాస్ట్రోల్, ప్రోహోండా, హీరో, సర్వో, బజాజ్ డీటీఎస్, స్టిక్కర్లు, లేబుల్స్ తెప్పించుకున్నాడు. విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్ ఫిల్టర్ చేసే వారి వద్ద నుంచి నకిలీ ఇంజిన్ ఆయిల్ తక్కువ ధరకు పెద్ద పెద్ద డ్రమ్ములు కొనుగోలు చేసి తన ఇంటి వద్దనే లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లో నకిలీ ఇంజిన్ ఆయిల్ నింపి టిన్ క్యాప్స్ సీల్ చేసి కోల్కత్తా నుంచి తెప్పించిన వివిధ కంపెనీల పేర్లు గల స్టిక్కర్లు అతికించేవాడు. బైక్ మెకానిక్స్ గుర్తుపట్టని విధంగా లీటర్ రూ.200 చొప్పున అమ్ముతూ వారిని మోసం చేసేవాడు. 2007లో విజయవాడలో తన ఇంట్లో నకిలీ ఆయిల్ బాటిల్స్లో నింపుతుండగా విజయవాడ వన్టౌన్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
బయటకు వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ సంస్థలో 2017 వరకు మార్కెటింగ్ ఉద్యోగం చేశాడు. తర్వాత అగ్రిగోల్డ్ సంస్థ కంపెనీ మూసి వేయడంతో మళ్లీ నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేసి డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. నకిలీ ఆయిల్ లీటర్ బాటిల్స్లో నింపి కారులో వేసుకొని లీటర్కు రూ.200 చొప్పున నేరేడుచర్ల, మిర్యాలగూడలోని బైక్ మెకానిక్స్ కు అమ్మేవాడు. శుక్రవారం రామాపురం క్రాస్రోడ్డు వద్ద సూర్యాపేట, కోదాడ రూరల్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.
అటుగా వచ్చిన వెంకటేశ్వరరావు కారును ఆపి తనిఖీ చేయగా ఆయిల్కనిపించింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువైన నకిలీ ఆయిల్స్, టొయోటా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.