- ఐబీ ఆఫీసర్ హత్యపై క్రైం బ్రాంచ్ పోలీసుల చార్జిషీట్
- ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కుట్రపన్నాడని ఆరోపణ
- మత కలహాలను రెచ్చగొట్టి గుంపును ఉసిగొల్పిండు
- సల్మాన్ అనే వ్యక్తి అంకిత్ను చంపిండు
- ఒంటిపై 51 కత్తి పోట్లున్నయ్.. పదునైన ఆయుధపు గాట్లున్నయ్
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఆఫీసర్ అంకిత్ శర్మను కావాలని టార్గెట్ చేసి, కుట్రపన్ని హత్య చేశారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అంకిత్ను కత్తితో 51 సార్లు పొడిచారని, కర్రలు, రాళ్లతో కొట్టి చంపారని చెప్పారు. తర్వాత బాడీని అక్కడి నాలాలో పారేశారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎక్స్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ గుంపును రెచ్చగొట్టి హత్యకు కారణమయ్యాడని పేర్కొన్నారు. హసీన్ అలియాస్ సల్మాన్ అనే వ్యక్తి హత్యలో కీలకంగా ఉన్నాడని చెప్పారు. యాంటీ సీఏఏ నిరసనలతో ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో నార్త్ఈస్ట్ ఢిల్లీలోని చాంద్బాగ్లో అంకిత్ శర్మను కొందరు దుండగులు చంపేసి నాలాలో పడేసిన సంగతి తెలిసిందే. దానిపై బుధవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. జూన్ 16న కోర్టు కేసును విచారించనుంది.
తాహిర్హుస్సేనే రెచ్చగొట్టాడు
అంకిత్ హత్య కేసులో తాహిర్ హుస్సేనే మాస్టర్ మైండ్ అని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. ‘‘సీఏఏ అల్లర్లకు తాహిర్ హుస్సేన్ మతం రంగును పులిమాడు. మత కలహాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే గుంపును జనాలపైకి ఉసిగొల్పాడు. దీంతో ఫిబ్రవరి 24న షేర్పూర్ చౌక్లో ఆ గుంపు షాపులపై దాడులకు దిగింది. ఆ గుంపులోని ఆందోళనకారులు రాళ్లు విసిరారు. షాపులను తగులబెట్టారు. ఇళ్లపైనా పెట్రోల్ బాంబులు విసిరారు. అల్లర్లను కంట్రోల్ చేసే డ్యూటీలో ఉన్న అంకిత్ శర్మను పట్టుకుని చాంద్బాగ్ పూలియాలోకి ఈడ్చుకెళ్లారు. కత్తులతో పొడిచి చంపేశారు. తర్వాత బాడీని అక్కడి నాలాలో పడేశారు. తెల్లారి ఫిబ్రవరి 25న అంకిత్ శర్మ బాడీని నాలా నుంచి బయటకు తీశారు. పోస్ట్మార్టం చేసిన డాక్టర్లు 51 కత్తి పోట్లు, ఇతర పదునైన ఆయుధపు గాట్లు ఉన్నట్టు తేల్చారు’’ అని చార్జిషీట్లో పేర్కొన్నారు.
ఓ సాక్షి ఇంటి టెర్రేస్పై తీసిన వీడియో ఆధారంగా రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి అరెస్ట్ చేశామని, అతడిని సల్మాన్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. తాహిర్, సల్మాన్ సహా పదిమందిని అరెస్ట్ చేశామన్నారు. ఇంటరాగేషన్లో సల్మాన్ నేరాన్ని ఒప్పుకున్నట్టు వివరించారు. అంకిత్ శర్మను చంపేసిన రోజే తాహిర్ హుస్సేన్ తన ఫ్యామిలీని సొంతూరైన ముస్తఫాబాద్కు పంపించాడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. పోలీసులకు అప్పగించిన తన గన్ను అల్లర్లు జరిగిన ముందురోజే విడిపించి తీసుకెళ్లాడని, వంద కార్ట్రిడ్జ్లను కొన్నాడని చెప్పారు. అందులో 64 లైవ్ కార్ట్రిడ్జ్లు, 22 షెల్స్ను స్వాధీనం చేసుకున్నామని, మిగతా వాటి గురించి అడిగితే తాహిర్ నుంచి సరైన సమాధానం లేదని వెల్లడించారు. 96 మంది సాక్షులను విచారించాకే అంకిత్ హత్యకు కారణం తాహిర్ హుస్సేన్, హత్య చేసింది సల్మాన్ అన్న నిర్ధారణకు వచ్చామని చార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు.