Vetri Duraisamy: స‌ట్లెజ్‌ న‌దిలో త‌మిళ డైరెక్టర్ మృత‌దేహం లభ్యం

Vetri Duraisamy: స‌ట్లెజ్‌ న‌దిలో త‌మిళ డైరెక్టర్ మృత‌దేహం లభ్యం

తమిళ సినీ దర్శకుడు, చెన్నై మాజీ మేయర్ కుమారుడు వెట్రి దురైసామి మృత‌దేహం లభ్యమైంది. ఫిబ్రవ‌రి 4వ తేదీన వెట్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని షిమ్లా నుంచి స్పితి వెళ్తున్న స‌మ‌యంలో సట్లెజ్ నదిలో పడిపోయింది. ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఆయన మృతదేహం లభ్యమైంది. 

ప్రమాదంలో కారు డ్రైవర్ టెంజిన్ చనిపోగా.. వెట్రితో ప్రయాణిస్తున్న గోపినాథ్ అనే మ‌రో వ్యక్తిని స్థానికులు ర‌క్షించారు. 45 ఏళ్ల వెట్రి కోసం గత తొమ్మిది రోజులుగా సహాయక బృందాలు తీవ్రంగా గాలించాయి. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో మహిన్ నాగ్ అసోసియేషన్‌కు చెందిన గజ ఈత‌గాళ్ల బృందం వెట్రి మృతదేహాన్ని గుర్తించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఐజీసీఎంహెచ్)కి తరలించారు.

తన కుమారుడి ఆచూకీ కోసం స‌దాయి దొరైస్వామి భారీ రివార్డు కూడా ప్రక‌టించారు. వెట్రి ఆన‌వాళ్లను గుర్తించిన‌ వారికి కోటి న‌జ‌రానా ఇస్తానంటూ ప్రక‌టించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. స‌దాయి దొరైస్వామికి తన సంతాపాన్ని తెలియజేశారు. డైరెక్టర్‌గా వెట్రి ఇంద్రావ‌తు ఒరునాల్ అనే త‌మిళ చిత్రాన్ని తెరకెక్కించారు.