భర్త మారడని.. పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది

భర్త మారడని.. పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది

చెన్నై: మద్యానికి బానిసైన భర్తతో విసిగిపోయిన ఓ మహిళ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అన్నం పురుగుల మందు కలిపి తన ఇద్దరు పిల్లలకు తినిపించి చంపింది. తాను అదే ఆహారం తిని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఈరోడ్ జిల్లాలోని మలయంపాళ్యంలో ఉండే ప్రభు అనే వ్యక్తి రోజూ వారీ కూలీగా పని చేసేవాడు. అతడు మద్యానికి బానిస కావడంతో సాయంత్రానికి సంపాదించిన డబ్బులతో లిక్కర్ తాగేసి ఇంటికి వెళ్లేవాడు. తన దగ్గర లేనప్పుడు భార్య శశికళ (33)ను డబ్బులు ఇవ్వాలని హింసించేవాడు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంటోందని, పిల్లలను దృష్టిలో ఉంచుకునైనా మందు తాగడం మానుకోవాలని ఆమె నిత్యం చెబుతుండటంతో ఎప్పుడూ గొడవ అవుతుండేది. సోమవారం రాత్రి కూడా మందు తాగడానికి డబ్బుల కావాలని ప్రభు తన భార్యను అడిగాడు. అయితే మద్యం తాగడానికి వెళ్లొద్దని ఆమె చెప్పే ప్రయత్నం చేసినా.. వినకుండా కొట్టి డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో భర్త ఇక మారడని విసిగిపోయిన.. శశికళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. అన్నంలో పురుగుల మందు కలిపి తన కొడుకు నితిన్ శంకర్ (12), కూతురు సుదర్శన (10)లకు తినిపించి, తానూ తిన్నది. దీంతో అర్ధరాత్రి వేళ తీవ్ర అస్వస్థతకు గురైన గురైన శశికళ, పిల్లలు బాధ భరించలేక కేకలు వేయడంతో ఇంటి పక్కన వాళ్లు ఈరోడ్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆ ముగ్గురూ మరణించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.