- యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ విస్ట్రన్ను చేజిక్కించుకోనున్న కంపెనీ
- డీల్ విలువ రూ. 1,038 కోట్లు
న్యూఢిల్లీ: ఐఫోన్లను తయారు చేసే మొదటి ఇండియన్ కంపెనీగా టాటా ఎలక్ట్రానిక్స్ రికార్డ్ క్రియేట్ చేయనుంది. యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ విస్ట్రన్ దేశంలోని తమ ప్లాంట్ను టాటా గ్రూప్కు అమ్మడానికి సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించి విస్ట్రన్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది. కంపెనీ ప్లాంట్ ఈస్ట్ బెంగళూరుకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్లాంట్ను 125 మిలియన్ డాలర్ల (రూ.1,038 కోట్ల) కు అమ్మేందుకు విస్ట్రన్ బోర్డ్ ఆమోదం తెలిపింది. దేశంలో ఐఫోన్ల తయారీ ఎకోసిస్టమ్ను డెవలప్ చేయడంలో విస్ట్రన్ ఫెయిలయ్యిందని చెప్పాలి. అంతేకాకుండా లోకల్ ఎంప్లాయ్మెంట్ రూల్స్ను ఫాలో కావడంలో ఇబ్బంది పడింది. ‘కంపెనీ శుక్రవారం బోర్డు మీటింగ్ నిర్వహించింది. సబ్సిడరీ కంపెనీ విస్ట్రన్ ఇన్ఫోకామ్ మాన్యుఫాక్చరింగ్ (ఇండియా) లో 100 శాతం వాటాను టాటా ఎలక్ట్రానిక్స్కు అమ్మడానికి ఆమోదం తెలిపింది’ అని విస్ట్రన్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఇండియన్ సబ్సిడరీ కంపెనీలో తమ వాటాలను అమ్మడానికి ఎస్ఎంఎస్ ఇన్ఫోకామ్ (సింగపూర్), విస్ట్రన్ హాంకాంగ్ లిమిటెడ్లు టాటా గ్రూప్తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ను కుదుర్చుకున్నాయి. రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చాక ఈ డీల్ పూర్తవుతుంది. కాగా, దేశంలోని విస్ట్రన్ ప్లాంట్ 22 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో విస్తరించింది. టాటా కంపెనీలు ఇక నుంచి దేశంలో ఐఫోన్లను తయారు చేస్తాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. విదేశాలకు ఎగుమతులు కూడా చేపడుతుందని చెప్పారు. విస్ట్రన్ కార్యకలాపాలను టేకోవర్ చేసినందుకు టాటా టీమ్కు శుభాకాంక్షలు చెప్పారు.