టాటా టెక్నాలజీస్, టాటా హిటాచీలో షేర్ల సేల్
న్యూఢిల్లీ : టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, టాటా హిటాచీ కన్స్ట్రక్షన్ మెషినరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లలో టాటా మోటార్స్ వాటాలను అమ్మాలనుకుంటోంది. మూడేళ్లలో టాటా మోటార్స్ను అప్పులు లేని సంస్థగా మార్చేందుకు వాటాల విక్రయం చేపట్టాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అప్పులు తగ్గించుకోవడానికి టాటా మోటార్స్కు డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కీలకం. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.48 వేల కోట్లుగా ఉన్న టాటా మోటార్స్ నెట్ కన్సాలిడేటెడ్ డెట్ జూలై 31 నాటికి రూ.68 వేల కోట్లకు పెరిగింది. కరోనా వైరస్ అవుట్బ్రేక్తో టాటా మోటార్స్కు అప్పులు కూడా ఎక్కువయ్యాయి. తన సాఫ్ట్వేర్ సంస్థ టాటా టెక్నాలజీస్, హిటాచీ జాయింట్ వెంచర్లో ఈక్విటీ వాటాలను అమ్మడానికి పలువురితో టాటా మోటార్స్ చర్చలు ప్రారంభించినట్టు తెలిసింది.
మరికొన్ని కంపెనీల్లోనూ..
‘తొలుత ఈ రెండు కంపెనీల్లో వాటాలను అమ్మాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. మరిన్ని నాన్ కోర్ వ్యాపారాల్లో కూడా త్వరలోనే వాటాలను అమ్ముతుంది. అప్పును తగ్గించేందుకు ప్రమోటర్లు మరింత ఈక్విటీని పెంచుతారు’ అని సంబంధిత వ్యక్తులు చెప్పారు.