- కొన్ని ప్రొడక్టులకు ఒబీస్ ట్యాక్స్
- ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచన
న్యూఢిల్లీ: దేశమంతటా ప్రజలలో పెరుగుతున్న అధిక బరువు సమస్యను పరిష్కరించడానికి నీతి ఆయోగ్ ఒక కొత్త ప్రపోజల్తో ముందుకు వచ్చింది. చక్కెర, కొవ్వు, ఉప్పు శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలపై పన్ను విధించడాన్ని 2021–-22 యాన్యువల్ రిపోర్టు సూచించింది. దీని ప్రకారం, సమస్యను పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆధారాలను స్టడీ చేస్తోంది. స్థూలకాయం సమస్యను తగ్గించడానికి అధిక బరువుకు దారితీసే ఆహార పదార్థాలపై పన్ను విధించడాన్ని ఒక ఆప్షన్ గా చూస్తున్నామని నీతి ఆయోగ్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా భారతదేశంలోని పిల్లలు, టీనేజర్లు, మహిళల్లో ఊబకాయం పెరుగుతోందని నీతి ఆయోగ్ ఆందోళన ప్రకటించింది. "ప్రసూతి, టీనేజ్, చిన్ననాటి ఊబకాయం నివారణపై నీతి ఆయోగ్ జాతీయ సంప్రదింపుల కమిటీ సభ్యుడి (ఆరోగ్యం) నాయకత్వంలో జూన్ 24, 2021న సమావేశం నిర్వహించారు. సమస్యను పరిష్కరించడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. కొవ్వులు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలపై పన్ను విధించడానికిఈ ప్రొడక్టుల ప్రకటనలను, మార్కెటింగ్ను, లేబుల్స్ను పరిశీలించారు" అని పేర్కొంది. స్థూలకాయానికి కారణమయ్యే నాన్ -బ్రాండెడ్ నమ్కీన్లు, భుజియాలు, వెజిటబుల్ చిప్స్,స్నాక్ ఫుడ్స్పై 5 శాతం జిఎస్టిని వసూలు చేస్తున్నారు. బ్రాండెడ్ ప్యాక్ చేసిన వస్తువులపై జీఎస్టి రేటు 12 శాతం ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–-20 ప్రకారం, 2015–-16లో ఊబకాయం ఉన్న మహిళల శాతం 20.6 శాతం నుండి 24 శాతానికి పెరిగింది. పురుషుల ఊబకాయం 18.4 శాతం నుండి 22.9 శాతానికి పెరిగింది.