- కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే పేదల ఇండ్ల కూల్చివేత
- సీఎం కేసీఆర్, ప్రభుత్వ అధికారుపై అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టాలె
- బీజేపీ నేత తీన్మార్ మల్లన్న
గచ్చిబౌలి, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో రాష్ర్టంలో పేదలెవరూ బాగుపడే పరిస్థితి లేదని బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజవకర్గంలో ప్రభుత్వ భూముల దోపిడీ జరుగుతోందని పేర్కొన్నారు. గచ్చిబౌలి పరిధి గౌలిదొడ్డిలోని సర్వే నం. 37లోని ప్రభుత్వ స్థలాన్ని మైహోం సంస్థ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టియ్యడని, ప్రస్తుతం పేదలు ఉండే స్థలాలను వారికే కేటాయించి, పట్టాలు అందజేయాలని కోరారు. సోమవారం గౌలిదొడ్డిలోని బసవతారక నగర్లో అధికారులు కూల్చివేసిన పేదల ఇండ్లను ఆయన స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 300 మంది పేదల ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసి, ప్రజలను రోడ్డున పడేశారన్నారు.
సీఎం కేసీఆర్, ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలని, రెవెన్యూ, పోలీసుల తీరు చూస్తుంటే రజాకార్ల తీరును గుర్తుకు తెస్తోందని మల్లన్న అన్నారు. బీజేపీ పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన సెగ్మెంట్ పరిధిలోని 300 కుటుంబాలు రోడ్డున పడితే పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. రియల్ ఎస్టేట్ దందాలో ఎమ్మెల్యే గాంధీ బీజీగా ఉన్నాడని, అందుకే పేదల ఇండ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.