లారీని ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి.. మహబూబ్నగర్ జిల్లా మాచారం వద్ద హైవేపై ఘటన

లారీని ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి.. మహబూబ్నగర్ జిల్లా మాచారం వద్ద హైవేపై ఘటన
  • 12 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • మృతుల్లో అత్తా కోడలు, బస్సు డ్రైవర్, క్లీనర్​​
  • మహబూబ్​నగర్​ జిల్లా మాచారం వద్ద హైవేపై ఘటన

జడ్చర్ల, వెలుగు: ఓల్వో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్తా కోడలు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ఈ ప్రమాదం మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద నేషనల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గురువారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్​కు ప్రయాణికులతో బయల్దేరిన ఓల్వో బస్సు మాచారం సమీపంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు లక్ష్మీదేవి (65),  గుర్రం రాధిక (49)తోపాటు బస్సు డ్రైవర్​ బస్సుపాక నర్సింహ (50) అక్కడికక్కడే మృతి చెందారు.

బస్సు క్లీనర్ నర్సింహ(35) మహబూబ్​నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన 12 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అదే హైవేపై ప్రయాణిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి తన కాన్వాయ్​ను ఆపి బాధితులను పలు వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఫోన్​లో ఆదేశించారు.  

పెళ్లికి హాజరై తిరిగి వస్తూ..
హైదరాబాద్​లోని కూకట్​పల్లికి చెందిన లక్ష్మీదేవి, రాధిక వరుసకు అత్తాకోడళ్లు. వీరిద్దరు కడప జిల్లాలో బంధువుల ఇంట్లో పెండ్లికి హాజరై గురువారం రాత్రి హైదరాబాద్​కు బయల్దేరారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ చనిపోవడంతో వారి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. రాధిక భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మహబూబ్​నగర్​ డీఎస్పీ వెంకటేశ్వర్లు, టౌన్​సీఐ కమలాకర్ పరిశీలించారు.