
- రెండు ఆడ, ఒక మగపులి కావాలని మహారాష్ట్రను కోరిన తెలంగాణ
- అటవీ శాఖ ప్రతిపాదనకు పొరుగు రాష్ట్రం అంగీకారం
- త్వరలో కవ్వాల్కు ఎన్టీసీఏ బృందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులులు లేకపోవడంతో మహారాష్ట్రలోని తాడోబా నుంచి వాటిని తీసుకొచ్చేందుకు తెలంగాణ అటవీ శాఖ కసరత్తు చేస్తున్నది. తాడోబా, తిప్పేశ్వర్, కదంబా వంటి రిజర్వ్ ఫారెస్టుల నుంచి పులులు కవ్వాల్, ఆసిఫాబాద్ అడవికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నా.. స్థిరంగా ఉండడం లేదు.
దీంతో కవ్వాల్లో పులుల సంతతి పెంచడంతోపాటు శాశ్వత ఆవాసంగా మార్చేందుకు తాడోబా నుంచి రెండు ఆడపులులు, ఒక మగపులిని తీసుకురావాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ అటవీ శాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు.. మహారాష్ట్ర చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ కు ప్రతిపాదనలు పంపించగా.. అందుకు మహారాష్ట్ర సర్కారుఅంగీకారం తెలిపింది.
దీంతో పులుల రీలోకేషన్ ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ‘నేషనల్ టై గర్ కన్సర్వేషన్ అథారిటీ’ (ఎన్టీసీఏ) కి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించారు. తర్వలోనే ఎన్టీసీఏ బృందం కవ్వాల్ లో పర్యటించనున్నట్లు తెలిసింది. రిజర్వ్ ఫారెస్టులో పులుల సంచారానికి అనుకూలతలు, ఆహారం, ఆవాస సామర్థ్యం, నీటి వసతి, పర్యావరణం, జన్యురీత్యా ఏర్పడే ప్రభావాలు తదితర అంశాలను పరిశీలించిన తర్వాత ఎన్టీసీఏ అనుమతులు మంజూరు చేస్తుంది.
మహారాష్ట్ర నుంచి కాగజ్నగర్ కారిడార్ వైపు వచ్చిపోతున్న పులులను సైతం కవ్వాల్ రిజర్వ్కు తరలించేలా అటవీశాఖ ప్రణాళికలు రచిస్తోంది. కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యంను 2012లో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించారు.ఇది గోదావరి పరీవాహక ప్రాంతంలో మొత్తం 2,015.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించింది.
కవ్వాల్ కోర్ ఏరియా నుంచి మైసంపేట, రాంపూర్ గ్రామాల ప్రజలను ఇప్పటికే వేరే ప్రాంతానికి తరలించి, పులుల ఆవాసానికి అనుకూల వాతావరణం కల్పించారు. పులుల ఆహారం కోసం జింకలు, సాంబార్, నీల్ గాయి వంటి వన్యప్రాణులను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి తెచ్చిన పులులకు ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు.
పులుల సంతతి పెరిగే చాన్స్
తాడోబా టైగర్ రిజర్వ్లో 40 నుంచి 50 వరకు, ఇంద్రావతి నేషనల్ పార్కులో 20 నుంచి 35 వరకు పులులు ఉన్నాయి. అక్కడ పెద్దపులుల సంఖ్య భారీగా పెరగడం, టెరిటరీ కోసం ఆధిపత్య పోరుతో కాగజ్నగర్ కారిడార్ వైపు కొన్ని పులులు వలస వస్తున్నాయి. ఇలా వస్తున్న పులులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వాటిని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్కు మళ్లీస్తే ఆవాసం కల్పించి, కాపాడడంతోపాటు అటవీ సంపదను కూడా పరిరక్షించే అవకాశం ఉంటుంది. కాగా, రీలోకేషన్ ప్రక్రియ విజయవంతమైతే కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
పన్నాలో రీలొకేషన్ విజయవంతం
అడవిలో ఎక్కువగా పులులు ఉంటే వాటిని మరో ఫారెస్ట్కు తరలించడాన్ని ‘టైగర్ రీలొకేషన్ ’ అంటారు. దీంతో పులుల సంతతి పెరిగే అవకాశం ఉంది. గతంలో మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో రీలొకేషన్ విధానం అవలంబించగా.. అది విజయవంతమైంది.
అక్కడి టైగర్ రిజర్వ్లో 2009 నాటికి ఒక్క పెద్దపులి కూడా లేదు. దీంతో అదే రాష్ట్రంలోని అడవుల నుంచి పన్నా రిజర్వ్ ఫారెస్ట్కు 4 పులులను తరలించారు. ప్రస్తుతం పన్నాలో పెద్ద పులుల సంఖ్య 50కి చేరడం విశేషం. ఇప్పుడు పన్నా టైగర్రిజర్వ్ ప్రయోగాన్నే కవ్వాల్ లో అమలు చేస్తున్నారు.