19 జిల్లాల్లో ఉద్యోగులకు జూన్ నెల జీతాలు చెల్లించలేదు

19 జిల్లాల్లో ఉద్యోగులకు జూన్ నెల జీతాలు చెల్లించలేదు

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ప్రభుత్వం నేటికీ19 జిల్లాల్లోని ఉద్యోగులకు జూన్ నెల జీతాలు చెల్లించలేదు. ప్రతీ నెల ఇదే పరిస్థితి. రోజుకు కొన్ని జిల్లాల చొప్పున విడతల వారీగా జీతాలు చెల్లిస్తుండటంతో.. తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక ఉద్యోగులు ఆశగా ఎదురుచూడాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి నెలా ఒకటో తారీఖున ఉద్యోగులకు ఠంచనుగా జీతాలు పడేవి. స్వరాష్ట్రంలో ఒకటో తేదీ కాదు కదా, కనీసం ఒకటో వారంలో జీతాలు వస్తే హమ్మయ్య అనుకునే పరిస్థితి దాపురించింది. ఉమ్మడి రాష్ట్రంలో నెలాఖరున దసరా, దీపావళి, రంజాన్ వంటి పండుగలు వస్తే వారం రోజుల ముందే వేతనాలు చెల్లించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వరాష్ట్రంలో పండుగలకు ముందు కాదుకదా, ఒకటో తేదీన కూడా ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న 90వ దశకంలో కూడా ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కాలేదు. కానీ , రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పరిస్థితి పూర్తిగా 
తలకిందులైంది. 

నెలకు మూడు వేల కోట్లు లేవా?
2022-–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 2,45,257 కోట్లు. రాష్ట్ర సొంత రెవెన్యూ రూ1,33,634 కోట్లు. వీటిలో పన్నుల ద్వారా రాష్ట్ర రాబడి రూ.1.08,212 కోట్లు. కాగా, నాన్-టాక్స్ సొంత రెవెన్యూ రూ.25,422 కోట్లు. ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాల వార్షిక వ్యయం రూ.25 వేల కోట్లు కాగా, పెన్షన్ల ఖర్చు రూ.11 వేల కోట్లు. రాష్ట్రానికి సొంత ఆదాయమే భారీగా ఉన్నా జీతాలు, పెన్షన్ల కోసం నెలకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఎందుకు సమస్యగా మారిందో అర్థంకావడం లేదు. ఆర్థిక సంవత్సరం చివరలో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో నిధులకు కటకట ఉండి, జీతాలు ఆలస్యం అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ప్రతి నెలా ఆలస్యమైతే ఏమనుకోవాలి? జీతాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని, దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు, తలసరి ఆదాయం సాధిస్తున్నది తెలంగాణ మాత్రమేనని మంత్రులు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. 2021 జులై నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మూడు డీఏ వాయిదాలు కూడా పెండింగులోనే  ఉన్నాయి. దాదాపు 10.01 శాతం డీఏ పెరగాల్సి ఉంది. డీఏల సంగతి దేవుడెరుగు? సకాలంలో జీతాలు చెల్లిస్తే చాలు అనుకునే పరిస్థితికి ఉద్యోగ, ఉపాధ్యాయులను తీసుకొస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. 

సప్లిమెంటరీ బిల్లులతో సమస్యలు! 
వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల కారణంగా లీవ్ పెట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు రావడం పూర్తిగా దైవాధీనంగా తయారైంది. సప్లిమెంటరీ బిల్లులను పాస్ చేయకుండా ఈ -కుబేర్ లో నెలల తరబడి పెండింగులో పెడుతున్నారు. సర్టిఫికెట్స్, లీవ్ ఫామ్ జత చేసి సెలవు మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించినా మెజారిటీ అధికారులు అడ్వాన్సుగా లీవ్ మంజూరు చేయడానికి ససేమిరా అంటున్నారు. డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి, లీవ్ మంజూరుకు అభ్యర్థిస్తే నిబంధనల ప్రకారం వెంటనే లీవ్ మంజూరు చేయాలి. కానీ, అవగాహనాలోపంతో ముందుగా లీవ్ మంజూరు చేయకుండా, విధుల్లో చేరిన తర్వాతే లీవ్ మంజూరు చేస్తున్నారు. పైగా, వేతనంలో కోత కూడా విధిస్తున్నారు. ఈ నెల విషయమే తీసుకుంటే, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు(సోమ, మంగళ, బుధవారాల్లో) సెలవు ప్రకటించింది. ఈ నెల 8 వరకు సెలవుపై ఉండి, సోమవారం విధుల్లో చేరాలన్న టీచర్లకు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన హాలిడేస్ కారణంగా ఈ నెల 13 వరకు విధుల్లో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. సదరు టీచర్లు14 నాడు మాత్రమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. లీవ్ పీరియడ్ పది రోజులు దాటితే, ఆకస్మిక సెలవు మంజూరు చేయడానికి కూడా వీలు ఉండదు. ఇలాంటి సందర్భాల్లో లీవ్ పీరియడ్ కు ముందు జనరల్ హాలిడేస్ ఉంటే వాటిని ప్రిఫిక్స్ కి, 9 నుంచి 13వ తేదీ వరకు సఫిక్స్ కి విధిగా అనుమతించాలి. ఎందుకంటే, తాజాగా ప్రకటించిన మూడు రోజుల సెలవులను ప్రభుత్వం లోకల్ హాలిడేస్ గా పేర్కొనలేదు. జులై 8 వరకు మాత్రమే అర్హత కల్గిన ఆకస్మికేతర సెలవు(ఓసిఎల్) మంజూరు చేయాలి. వేతనంలో కోత విధించకూడదు. కానీ, వేతన మంజూరు, పంపిణీ అధికారులు(డీడీఓలు) లీవ్ పెట్టిన టీచర్లకు వేతనంలో కోత విధిస్తామని చెప్తున్నారు. కోత పెట్టిన వేతనాన్ని మరుసటి నెలలో సప్లిమెంటరీ బిల్లు ద్వారా తిరిగి క్లెయిమ్ చేస్తున్నారు. సప్లిమెంటరీ బిల్లులను పెండింగులో పెడుతుండటంతో లీవ్ పీరియడ్ శాలరీ ఎన్ని నెలలకు చేతికి వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. 

బిల్లులన్నీ పెండింగ్
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వివిధ రకాల బిల్లులన్నీ పెండింగులో పెడుతున్నారు. సరెండర్ లీవ్, జీపీఎఫ్ అడ్వాన్సులు, పార్ట్ ఫైనల్ విత్​డ్రాయల్స్, మెడికల్ రీయింబర్సుమెంట్, ఎఫ్ఏసీ అలవెన్సు, పిల్లల ఫీజు రాయితీ తదితర బిల్లులు నెలల తరబడి పెండింగులో పెడుతున్నారు. రిటైరయ్యే రోజే రిటైర్​మెంట్ ప్రయోజనాలు చెల్లిస్తామని స్వయంగా సీఎం హామీ ఇచ్చినా పెన్షన్ కమ్యూటేషన్ బిల్లులు సైతం నెలలు దాటినా శాంక్షన్ కావడం లేదు. ఈ-కుబేర్ లో పెండింగులో పెడుతున్నారు. సత్వర చెల్లింపులు, పారదర్శకత కోసం అంటూ తీసుకొచ్చిన ఈ-కుబేర్ సిస్టం నిర్దేశిత లక్ష్యం కోసం వాడుతున్నారా? లేక సెంట్రలైజ్డ్ పేమెంట్ విధానంతో ఏ బిల్లునైనా పెండింగులో పెట్టడానికి వినియోగిస్తున్నారో అర్థం కాకుండా ఉంది. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగుల బాధలు పట్టించుకునే వారే లేకుండా పోయారు. గత రెండేండ్లుగా ప్రతి నెల జీతాలు చెల్లించడంలో ఆలస్యమైనా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆవేదన కలిగిస్తోంది. ఇప్పటికైనా సీఎం చొరవ చూపాలి. సంఘాల ప్రతినిధులను పిలిపించుకొని చర్చించి సమస్యలను పరిష్కరించాలి. ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూసే దుస్థితి పోవాలి. తమది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కారని తరచూ చెప్పే మాటలను ఆచరణలో చూపించాల్సి ఉంది. 
- మానేటి ప్రతాపరెడ్డి,గౌరవాధ్యక్షుడు,టీఆర్ టీఎఫ్