
హైదరాబాద్, వెలుగు: అక్రమ తవ్వకాలు, గ్రావెల్ అనధికార రవాణాకు సంబంధించి గనుల శాఖ సహాయ డైరెక్టర్ (ఏడీఎంజీ) ఇచ్చిన డిమాండ్ నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. టీఎస్ఎంఎంసీ నిబంధన 26లో పేర్కొన్న విధానం ప్రకారం నోటీసులు జారీ చేయాల్సి ఉందని తేల్చి చెప్పింది. పెనాల్టీలు విధించే అధికారం ఏడీఎంజీకి ఉన్నప్పటికీ గరిష్ఠ పెనాల్టీ విధించే ముందు దానికి తగిన కారణాలను పేర్కొనాల్సి ఉందని తెలిపింది.
కంపెనీల వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏడీఎంజీ జారీ చేసిన డిమాండ్ నోటీసులను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అనధికారికంగా గ్రావెల్ రవాణా చేశారంటూ ఏడీఎంజీ ఇచ్చిన డిమాండ్ నోటీసులను సవాలు చేస్తూ జి.ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్తో పాటు పలు సంస్థలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.