హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ వల్ల తెలంగాణలోని అన్ని రకాల ఇండస్ట్రీలు నష్టపోయాయని, తిరిగి కోలుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం తప్పనిసరి అని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలని అన్నారు. చాలా కంపెనీలు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని చెప్పారు. మార్కెట్లో పరిస్థితులు బాగా లేవు కాబట్టి ఇప్పట్లో పూర్తిస్థాయి ప్రొడక్షన్ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన ‘వీ6వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
లాక్డౌన్ దెబ్బతీసింది
లాక్డౌన్ ప్రభావం తెలంగాణలోని సుమారు 40 వేల ఎంఎస్ఎంఈలపై కనిపిస్తోంది. ఫార్మా, ఎసెన్షియల్ కమోడిటీస్ను తయారీ చేసే ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం గతంలోనే సడలింపులు ఇచ్చింది. ఉద్యోగులకు ఇవి జీతాలను చెల్లించాలి. బ్యాంక్ అప్పులను, వడ్డీలను చెల్లించడమూ తప్పదు. జీఎస్టీ, ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ల భారం ఎలాగూ ఉంటుంది. లాక్డౌన్ పిరియడ్కు కూడా జీతం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటికీ ఇండస్ట్రీల దగ్గర డబ్బు లేదు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవడం తప్పనిసరి.
జీతాలు ఇవ్వడం కష్టమే..
ప్రస్తుత కష్టాల నుంచి పరిశ్రమలు బయటపడాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. లాక్డౌన్ పీరియడ్ ఎలక్ట్రిసిటీ బిల్లులను, చార్జీలను ప్రభుత్వం రద్దు చేయాలి. ఫిక్స్డ్ ఛార్జీలను చెల్లించడాన్ని మే చివరి వరకు ప్రభుత్వం వాయిదా వేసింది. వీటిని మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. జీతాలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ఆదేశాలు ఇచ్చింది. చిన్న పరిశ్రమలపై ప్రత్యక్షంగా ఆధారపడే కార్మికులు 15 లక్షల మంది వరకు ఉంటారు. పరోక్షంగా మరో 20 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. గత 40 రోజుల నుంచి పరిశ్రమలు నడవడం లేదు. గవర్నమెంటు పేమెంట్లు సైతం ఆగిపోయాయి. ఇట్లాంటి పరిస్థితులలో జీతాలు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది ?
ప్రస్తుతం స్థానిక కార్మికులు చాలు..
ప్రస్తుతం అన్ని యూనిట్లను ఒక షిప్ట్ మాత్రమే నడపాలి కాబట్టి వలస కార్మికులు అవసరం లేదు. పూర్తి సామర్థ్యంతో పరిశ్రమలు నడవాలంటే స కార్మికులు తప్పకుండా కావాలి. ప్రభుత్వాల సహకారం లేకుండా వారిని తీసుకురాలేం.