రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ఆదిలాబాద్ నెట్​వర్క్, వెలుగు: బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిలా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్​లో జరిగిన వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పార్టీ ఆఫీస్ ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది త్యాగదనులు పోరాడారని, వారి పోరాటం ఫలితంగా తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయ్, మయూర్ చంద్ర, సుహాసినీ రెడ్డి, చిలుకూరు జ్యోతి రెడ్డి, దినేష్ మాటోలియా తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్​లో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్​లో భారీ బైక్​ ర్యాలీ చేపట్టారు.  మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ లీడర్లు విమోచన దినోత్సవ వేడులను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా, బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. ఆ తర్వాత మాట మార్చి జాతీయ సమైక్య దినోత్సవం అని కొత్త నాటకాలకు తెర తీశారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రజినీశ్​జైన్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర రావు, లీడర్లు తాజ్ ఖాన్, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

వాడవాడలో వేడుకలు

బెల్లంపల్లి పట్టణంలో పాత బస్టాండ్, రైల్వే స్టేషన్ ముందు జాతీయ జెండాను ఆ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్, టేకులబస్తీ లోని బీజేపీ ఆఫీస్ వద్ద ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీలు ఆవిష్కరించారు. తాండూర్,కాసిపేట, నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి, భీమిని మండలాల్లో వివిధ గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి జాతీయ జెండాలు ఎగరేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జన్నారం మండల కేంద్రంలోని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధాని మోదీ బర్త్​డేను పురష్కరించుకొని కేక్ కట్ చేశారు. బీజేపీ మండల ప్రెసిడెంట్ గోలి చందు,రాష్ట్ర కార్యవర్గసభ్యుడు హరినాయక్, బీజేవైఎం మండల ప్రెసిడెంట్ ముడుగు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నేరడిగొండ మండలంలోని  బీజేపీ మండల అధ్యక్షుడు హీరా సింగ్ ఆధ్వర్యంలో నారాయణపూర్, వాంకిడి, బంధం పోలింగ్ బూత్​లలో జాతీయ జెండాను ఆవిష్కరించి నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. కుంటాల మండల కేంద్రంలో బీజేపీ, హిందూవాహిని ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జైనథ్ మండలంలో పార్టీ మండలాధ్యక్షుడు కట్కం రామదాసు ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు.