కాంగ్రెస్​ జయకేతనం..మార్పుకే జైకొట్టిన తెలంగాణ

కాంగ్రెస్​ జయకేతనం..మార్పుకే  జైకొట్టిన తెలంగాణ
  • 64 చోట్ల కాంగ్రెస్​, మరో చోట మిత్రపక్షం సీపీఐ విజయం
  • సౌత్​ తెలంగాణలో జోరు.. నార్త్​లోనూ అదే హోరు
  • 39 సీట్ల దగ్గర్నే కారుకు బ్రేక్​.. ఆరుగురు మంత్రులకు షాక్​
  • బీజేపీకి 8 సీట్లు.. 2018తో పోలిస్తే ఏడు సీట్లు అదనం 
  • కామారెడ్డిలో కేసీఆర్​, రేవంత్​పై వెంకటరమణారెడ్డి విక్టరీ
  • ఏడు సీట్లను కాపాడుకున్న ఎంఐఎం.. ఖాతా తెరువని బీఎస్పీ
  • ఊసులో లేని జనసేన.. డిపాజిట్లు కోల్పోయిన సీపీఎం

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ ప్రజలు మార్పుకే ఓటేశారు. కాంగ్రెస్​ పార్టీకి జైకొట్టి.. ఘన విజయం అందించారు. హ్యాట్రిక్​పై ఆశలు పెట్టుకున్న బీఆర్​ఎస్​ను ఓడగొట్టారు. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో అత్యధికంగా 64 సీట్లను కాంగ్రెస్​ గెలుచుకుంది. దాని మిత్రపక్షం సీపీఐ ఒక్క సీటులో పోటీ చేసి ఆ ఒక్కసీటునూ కైవసం చేసుకుంది. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న బీఆర్​ఎస్  కేవలం 39 సీట్లకు పరిమితమైంది. సౌత్​ తెలంగాణలో దాదాపు ఏకపక్షంగా జనం కాంగ్రెస్​కు సీట్లు అప్పగించారు. నార్త్​ తెలంగాణలోనూ కాంగ్రెస్​ హవా స్పష్టంగా కనిపించింది. బీజేపీ​8, ఎంఐఎం 7 సీట్లను గెలుచుకున్నాయి. మ్యాజిక్​ ఫిగర్​ను దాటి మెజారిటీ సాధించిన కాంగ్రెస్​ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుంది. కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీలతో పాటు రాష్ట్రంలో మార్పు కావాలనే నినాదానికి తెలంగాణ ఓటర్లు మొగ్గు చూపారు.  2018 ఎన్నికలతో పోలిస్తే ప్రధాన పార్టీల సీట్లు, ఓట్ల బలం ఈసారి తారుమారైంది. అప్పటి ఎన్నికల్లో టీఆర్​ఎస్​ (ప్రస్తుత బీఆర్​ఎస్​) 88 సీట్లు, కాంగ్రెస్ 19,​ ఎంఐఎం 7, బీజేపీ ఒకటి,  ఇతర పార్టీలు 4 సీట్లను గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఫిరాయింపులు, ఉప ఎన్నికలతో కలిపి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 104కు చేరింది. ఇప్పుడు అది 39కి పడిపోయింది. ఆ గెలిచినవాళ్లలో 23 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలు.

కామారెడ్డిలో సంచలనం

రెండు చోట్ల పోటీ చేసిన బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ తన సిట్టింగ్ సీటు గజ్వేల్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు. కొత్తగా పోటీ చేసిన కామారెడ్డిలో పరాజయం చెందారు. అటు కొడంగల్​తో పాటు ఇటు కేసీఆర్​పై కామారెడ్డిలో పోటీ చేసిన పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి.. కొడంగల్​లో విజయం సాధించారు. కామారెడ్డిలో ఆయన కూడా ఓడిపోయారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపొంది సంచలనం సృష్టించారు. ఈ స్థానంలో కేసీఆర్​ రెండో ప్లేస్​కు, రేవంత్​ మూడో ప్లేస్​కు పరిమితమయ్యారు. బీఆర్​ఎస్​ కేబినెట్​లోని మంత్రుల్లో ఆరుగురు ఓటమి పాలయ్యారు.

 బీజేపీలో ఏడుగురు కొత్తోళ్లు

గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ మంచి ఫలితాలను రాబట్టుకుంది. 2018 ఎన్నికల్లో గోషామహల్​ సీటుకే పరిమితమైన ఆ పార్టీ.. ఆ తర్వాత ఉప ఎన్నికలతో మరో రెండు సీట్లు (దుబ్బాక, హుజూ రాబాద్) గెలుచుకుంది. అయితే.. ఊహించని రీతిలో ఈసారి ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. గోషామహల్​తోపాటు కొత్తగా మరో ఏడు సెగ్మెంట్లలో గెలుపొందింది. అసెంబ్లీలో తమ బలాన్ని అంతకంతకు పెంచుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీలు ముగ్గురికీ చేదు అనుభవమే ఎదురైంది. కరీంనగర్​లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, బోథ్​లో సోయం బాపూరావు ఓడిపోయారు. ఆ పార్టీ ముఖ్య నేత ఈటల రాజేందర్​ తాను పోటీ చేసిన రెండు సీట్లలో పరాజయం పాలయ్యారు. గజ్వేల్​లో సీఎం కేసీఆర్​పై, తన సొంత నియోజకవర్గం హుజురాబాద్​లోనూ బీఆర్​ఎస్ అభ్యర్థి కౌశిక్​రెడ్డిపై ఈటల ఓడిపోయారు. ​

  • బీజేపీతో పొత్తులో 8 చోట్ల పోటీ చేసిన జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.  
  • 107 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ ఖాతా తెరవలేదు. సిర్పూర్​లో ఆ పార్టీ స్టేట్​ చీఫ్, మాజీ ఐపీఎస్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​పై బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్​ విజయం సాధించారు. కాంగ్రెస్​తో పొత్తులో ఒక్క సీటులో పోటీ చేసిన సీపీఐ కొత్తగూడెంలో గెలుపొందింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అక్కడ గెలుపొందారు. 
  • గ్రెస్​తో పొత్తులు కుదరక 19 చోట్ల ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం అన్ని చోట్ల ఓటమిపాలైంది. పాలేరు నుంచి పోటీకి దిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అక్కడ డిపాజిట్​ కోల్పోయారు. 
  •  
  • గత ఎన్నికల్లో ఏడు సీట్లు గెలుచుకున్న ఎంఐఎం ఈసారి కూడా తమ ఏడు సీట్లను కాపాడుకుంది. వీరిలో నలుగురు సిట్టింగ్​లు, ముగ్గురు కొత్తవారు ఉన్నారు.

అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్​

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ కాంగ్రెస్​ పార్టీ రెండుసార్లు అధికారానికి దూరంగా ఉంది. ఈ సారి అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా అధికారాన్ని చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్​ ఫిగర్​ సీట్లను దాటేసింది. పీసీసీ చీఫ్, ఎంపీ​ రేవంత్​రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి గెలిచి రికార్డు సృష్టించారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి తమ సొంత నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యంతో గెలిచారు.