పెట్రో రేట్లలో స్టేట్ ట్యాక్సే ఎక్కువ

పెట్రో రేట్లలో స్టేట్ ట్యాక్సే ఎక్కువ
  • సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ తో పోలిస్తే అధికం
  • లీటర్ పెట్రోల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.19.90.. స్టేట్ వ్యాట్ రూ.27.63

హైదరాబాద్, వెలుగు : పెట్రోల్, డీజిల్ రేట్లలో కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ ​డ్యూటీ​ కన్నా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్ ఎక్కువని తేలింది. ఎక్సైజ్ ​సుంకంతో పోలిస్తే పెట్రోల్​పై రూ.7.5, డీజిల్​పై రూ.4.50 అధికంగా వ్యాట్​ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్​ రేట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా చేసుకున్న దరఖాస్తుకు.. రెండ్రోజుల కింద ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్ రిప్లై ఇచ్చింది. దాని ప్రకారం.. లీటర్ పెట్రోల్​ బేస్ ​ప్రైస్​ రూ.58.58 కాగా, కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్​ సుంకం రూ.19.90గా ఉంది. ఎక్సైజ్ డ్యూటీతో కలిపి పెట్రోల్​ధర రూ.78.48 కాగా, దానిపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ రూ.27.63గా ఉంది.

దీనికి తోడు డీలర్ కమీషన్​ రూ.3.55 కాగా.. మొత్తంగా లీటర్ పెట్రోల్ ​ధర రూ.109.66గా ఉంది. ఇక లీటర్ ​డీజిల్ బేస్ ప్రైస్ ​రూ.59.45 కాగా.. ఎక్సైజ్ ​డ్యూటీ రూ.15.8గా ఉంది. ఎక్సైజ్ ​డ్యూటీతో కలిపి డీజిల్ ధర రూ.75.25గా ఉండగా, దానిపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్​రూ.20.32గా ఉంది. డీలర్​ కమీషన్ రూ.2.25 కలిపి.. లీటర్ డీజిల్ రూ.97.81కి లభ్యమవుతున్నది. 

అన్ని రాష్ట్రాలూ తగ్గించినా..

గతంలో పెట్రోల్​ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు ఎక్సైజ్ ​డ్యూటీని తగ్గించింది. పెట్రోల్​పై రూ.13, డీజిల్​పై రూ.16 వరకు తగ్గించింది. రాష్ట్రాలూ తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు రూ.5 నుంచి రూ.10 వరకు వ్యాట్​ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాయి. మన రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదు.

ఇటు ఏపీతో పాటు కాంగ్రెస్ ​పాలిత రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గలేదు. దీంతో తెలంగాణ సహా వ్యాట్​ను తగ్గించుకోని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్​రేట్లు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్​ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఫస్ట్​ ప్లేస్​లో ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉండడం గమనార్హం.