హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు జవాన్ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు జవాన్ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందారు.  చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ.. లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన సీడీఎస్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. 2013లో బెంగళూరు రెజిమెంట్ నుంచి ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. సిపాయిగా విధులు నిర్వర్తిస్తూనే.. 2014లో పారా కమాండో ఎగ్జామ్ రాసి సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత 11వ పారాలో లాన్స్ నాయక్ గా చేరారు. గతేడాది వరకు సాయితేజ.. బెంగళూరులోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ట్రైనర్ గా విధులు నిర్వర్తించారు. అనంతరం సీడీఎస్ కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా చేరారు.  సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం మదనపల్లెలో ఉంటుంది. సాయితేజ ఈ రోజు ఉదయం వెల్లింగ్టన్ కు బయలుదేరేముందు.. వీడియో కాల్ చేసి భార్య, పిల్లలతో మాట్లాడారు. ఆ తర్వాత కాసేపటికే జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. సాయితేజ మృతితో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సాయితేజ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.