బిజినెస్డెస్క్, వెలుగు: హురున్ రిచ్ లిస్టులో తెలుగు రాష్ట్రాల నుంచి సంపన్నులు పెరిగారు. పదేళ్ల కిందట కేవలం ముగ్గురు మాత్రమే ఈ లిస్టులో స్థానం సంపాదించగా, ప్రస్తుతం వీరి వాటా 21 రెట్లు పెరిగి 69 మందికి చేరింది. బిలియనీర్ల సంఖ్య కూడా 15 కు ఎగిసింది. ‘హురున్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రిచ్ లిస్ట్ 2021’ లోని ధనవంతుల మొత్తం సంపద రూ. 3,79,200 కోట్లకు చేరుకుందని హురున్ ప్రకటించింది. హురున్ ఏపీ అండ్ తెలంగాణ రిచ్లిస్ట్లో హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి 58 మంది ఉన్నారు. రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు, తిరుపతి, విజయవాడల నుంచి ఒక్కొక్కరు చోటు సంపాదించారు. ఈ రిచ్ లిస్ట్ ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడిగా దివిస్ ల్యాబ్స్ ఫౌండర్ మురళి దివి, ఆయన ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ. 79 వేల కోట్లుగా ఉంది. రూ. 26,100 కోట్ల సంపదతో హెటెరో డ్రగ్స్ బీ పార్థసారధి రెడ్డి, ఆయన ఫ్యామిలీ స్థానం దక్కించుకుంది. ఈ రిచ్లిస్టులో రెండు కంపెనీల నుంచి ముగ్గురేసి చొప్పున చోటు పొందడం విశేషం. విర్కో ల్యాబొరేటరీస్కు చెందిన ముగ్గురు (వీరి మొత్తం సంపద రూ. 4,400 కోట్లు), సింగాణియా ఫుడ్స్ ఇంటర్నేషనల్కు చెందిన ముగ్గురు (వీరి మొత్తం సంపద రూ. 5,100 కోట్లు) హురున్ ఏపీ అండ్ తెలంగాణ రిచ్లిస్ట్లో చోటు సంపాదించుకున్నారు.
కష్ట కాలాన్ని దాటిన తెలుగు వ్యాపారస్తులు..
హురున్ లిస్ట్ ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహా ధనవంతులు 54 శాతం పెరిగారు. బయోలాజికల్–ఈ ఎండీ దాట్ల మహిమ (రూ. 7,700 కోట్ల సంపదతో) అత్యంత సంపన్నురా లైన మహిళగా నిలిచారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బిలియనీర్లు ఏడాది క్రితం తొమ్మిది మంది ఉండగా, ఈ సారి 15 కు చేరారని ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాజికుమార్ దేవకర్ అన్నారు. హురున్ ఏపీ అండ్ & తెలంగాణ రిచ్ లిస్ట్లో మొత్తం 69 మందికి చోటుదక్కిందని చెప్పిన ఆయన, ఇండియన్ ఎంటర్ప్రెనూర్ల ఫ్యూచర్ బాగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. వారి వెల్త్ క్రియేషన్ జర్నీలో మంచి పాత్ర పోషించాలనుకుంటున్నామని చెప్పారు. గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి సంపన్నులు 21 రెట్లు పెరిగారని హురున్ ఇండియా ఎండీ ఆనస్ రెహ్మన్ అన్నారు. పదేళ్ల క్రితం హురున్ రిచ్లిస్ట్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ముగ్గురే ఉన్నారని, ఈ సారి ఈ నెంబర్ 69 కి చేరిందని పేర్కొన్నారు. ఇంకో ఐదేళ్లలో ఈ నెంబర్ 200 కి చేరుకుంటుందని అంచనావేశారు. ఐఐఎఫ్ఎల్ హురున్ ఏపీ & తెలంగాణ రిచ్లిస్ట్లో సంపన్నులు పెరగడం తెలుగు ప్రజల వ్యాపార స్పూర్తికి నిదర్శనమని అన్నారు. ‘ హురున్ రిచ్ లిస్ట్10 వ ఎడిషన్ లోగోను సంస్కృత పదం ‘వీర్యా’ నుంచి తీసుకున్నాం. దీనర్ధం శక్తి అని. దేశ ఎకానమీ విజయవంతంగా వృద్ధి చెందుతుండడానికి కారణం ఎంటర్ప్రెనూర్ల శక్తి, వారి ధృడ సంకల్పమే. ఆర్థిక మాంద్యం కావొచ్చు, నోట్ల రద్దు కావొచ్చు లేదా కరోనా సంక్షోభం కావొచ్చు ఈ ఎంటర్ప్రెనూర్లు కష్ట కాలాలను దాటారు. ఇండియన్ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో దేశ ఎంటర్ప్రెనూర్లే కీలకం’ అని రెహ్మన్ పేర్కొన్నారు. ఇండియాలో వెల్త్ క్రియేషన్ 20–20 మ్యాచ్లా వేగంగా జరుగుతోందని, ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లా స్లోగా ఉండేదని పోల్చారు. కాగా, ఐఐఎఫ్ఎల్ హురున్ రిచ్లిస్ట్ను ఐదు రోజల కిందట విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రాల వారీగా డేటాను బయటపెట్టారు. గత పదేళ్లలో హురున్ రిచ్లిస్టులోని సంపన్నులు రోజుకి రూ. 2,020 కోట్లను క్రియేట్ చేశారని హురున్ ప్రకటించింది. ఇదే రేటులో సంపన్నులు పెరిగితే, వచ్చే ఐదేళ్లలో మరో 250 మంది బిలియనీర్లను ఇండియా యాడ్ చేయగలుగుతుందని వివరించింది. వచ్చే ఐదేళ్లలో బిలియనీర్ల పరంగా ఇండియా, యూఎస్తో పోటీపడుతుందని పేర్కొంది. ఐఐఎఫ్ఎల్ హురున్ రిచ్లిస్ట్ 2021 లో టాప్ పొజిషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరసగా పదో ఏట కూడా కొనసాగారు . ఆయన సంపద రూ. 7,18,000 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత పొజిషన్లో అదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద రూ. 5,05,900 కోట్లు.
కొత్త సంపన్నులు వచ్చారు..
ఈ సారి హురున్ ఏపీ అండ్ తెలంగాణ రిచ్లిస్టులో మొత్తం 13 మంది సంపన్నులు కొత్తగా చోటు సంపాదించుకున్నారు. వీరి మొత్తం సంపద రూ. 49,500 కోట్లు. ఈ సారి రిచ్లిస్టులోకి కొత్తగా చేరిన వారిలో రియల్ఎస్టేట్ కంపెనీ జీఏఆర్ ఫౌండర్ జీ అమరేందర్ రెడ్డి (సంపద రూ. 12,000 కోట్లు), సువెన్ ఫార్మాస్యూటికల్స్ జాస్తి వెంకటేశ్వర్లు (రూ. 9,700 కోట్లు), కెమికల్ కంపెనీ బాలాజీ ఎమైన్స్ ఏ ప్రతాప్ రెడ్డి (రూ. 7,500 కోట్లు), సాఫ్ట్వేర్ కంపెనీ తాన్లా ప్లాట్ఫామ్స్ దాసరి ఉదయ్ కుమార్ రెడ్డి(రూ. 4,700 కోట్లు) లు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ 10 ధనవంతులు..
పేరు వెల్త్ (రూ. కోట్లలో) కంపెనీ
దివి మురళి& ఫ్యామిలీ 79,000 దివీస్ ల్యాబొరేటరీస్
బీ పార్థసారధి రెడ్డి & ఫ్యామిలీ 26,100 హెటెరో ల్యాబ్స్
పీపీ రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి & ఫ్యామిలీ 23,400 మేఘా ఇంజినీరింగ్& ఇన్ఫ్రాస్ట్రక్చర్
కే సతీష్ రెడ్డి & ఫ్యామిలీ 12,300 డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్
జీ అమరేందర్ రెడ్డి& ఫ్యామిలీ 12,000 జీఏఆర్
ఎం సత్యనారాయణ రెడ్డి& ఫ్యామిలీ 11,500 ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్
జీవీ ప్రసాద్& ఫ్యామిలీ 10,300 డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్
వెంకటేశ్వర్లు జాస్తి& ఫ్యామిలీ 9,700 సువెన్ ఫార్మా
పీవీఎన్ రాజు 9,300 గ్లాండ్ ఫార్మా
వీసీ నన్నపనేని 9,100 నాట్కో ఫార్మా
ఈ ఇండస్ట్రీల నుంచే ఎక్కువ..
హురున్ రిచ్లిస్టులో ఎక్కువ మంది ఫార్మాసెక్టార్ నుంచే ఉన్నారు. 30 శాతం మంది సంపన్నులు ఈ సెక్టార్ వారే కావడం విశేషం. ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ (10 శాతం), కన్స్ట్రక్షన్ & ఇంజినీరింగ్ (9 శాతం) సెక్టార్ల నుంచి ఎక్కువ మంది సంపన్నులు ఉన్నారు.