అత్యుత్సాహంతో టైటాన్స్‌‌కు నిరాశ

అత్యుత్సాహంతో టైటాన్స్‌‌కు నిరాశ

ముంబై : ప్రొ కబడ్డీ లీగ్‌‌ ఏడో సీజన్‌‌లో తెలుగు టైటాన్స్‌‌ను దురదృష్ణం వెంటాడుతుంది. తొలి విజయానికి  అత్యుత్సాహం  అడ్డంపడింది. ప్రత్యర్థికి అనవసరంగా పాయింట్‌‌ ఇచ్చుకుని టై తో సరిపెట్టుకుంది. శుక్రవారం తెలుగు టైటాన్స్‌‌, యూపీ యోధా మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌‌ 20–20తో టై గా ముగిసింది. ఆటలో చివరి 30 సెకన్లు మిగిలుండగా ఇరుజట్లు 19–19తో నిలిచాయి. ఈ దశలో టైటాన్స్‌‌ స్టార్‌‌ రైడర్‌‌ సిద్ధార్థ్‌‌ దేశాయ్‌‌ కూతకు వెళ్లాడు. యూపీ ప్లేయర్‌‌ సుమిత్‌‌ మ్యాట్‌‌ దాటి బయటకు వెళ్లడంతో టైటాన్స్‌‌కు పాయింట్‌‌ దక్కింది. దీంతో టైటాన్స్‌‌ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. అయితే రిఫరీ టైం ఆఫ్‌‌ విజిల్‌‌ ఊదే లోపే టైటాన్స్‌‌ ఆటగాళ్లు మ్యాట్‌‌లో అడుగుపెట్టేశారు. దీనిపై రివ్యూకు వెళ్లిన యోధాకు ఒక టెక్నికిల్‌‌ పాయింట్‌‌ దక్కింది. దీంతో మళ్లీ స్కోర్లు సమమై మ్యాచ్‌‌ టైగా ముగిసింది. అంతకుముందు ఇరుజట్లు డిఫెన్స్‌‌లో సత్తా చాటాయి. ఓ దశలో 9–7తో టైటాన్స్‌‌ ఆధిక్యంలో ఉండగా, రైడింగ్‌‌లో సత్తా చాటిన యోధా ఫస్టాఫ్‌‌ ముగిసే సరికి ఆధిక్యాన్ని 11–11తో  సమం చేసింది. సెకండాఫ్‌‌లోను ఇరుజట్లు ఆటగాళ్ల చివరిదాకా నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. ఐదు పాయింట్లు సాధించిన సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌ టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచారు. మరో మ్యాచ్‌‌లో యు ముంబా 32–20తో గుజరాత్ ఫార్చ్యూన్‌‌ జెయింట్స్‌‌పై విజయం సాధించింది.  ముంబా ఆటగాడు అభిషేక్‌‌ సింగ్‌‌ రైడింగ్‌‌, ట్యాకిలింగ్‌‌లో సత్తా చాటాడు. 9–7 ఆధిక్యంతో ఫస్టాఫ్‌‌ను ముగించిన ముంబా సెకండాఫ్‌‌లో మరింత దూకుడుగా ఆడింది.