దేశంలో ఎండలు మండిపోనున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఐదు రోజులు జాగ్రత్త..
రాబోయే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్13 వరకు కూడా దేశంలోని చాలా ప్రాంతాలలోనూై 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో అక్కడక్కడా ఉరుములు, బలమైన గాలులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత ఇవే రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ఉంటుందని పేర్కొంది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలే..
దేశంలోని వాయువ్య రాష్ట్రాలు, ద్వీపకల్ప ప్రాంతాలు మినహాయించి..మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో హీట్వేవ్ ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 38 నుంచి -40 డిగ్రీల సెల్సియెస్గా నమోదవుతోంది.
హీట్వేవ్ అలర్ట్..
వాయువ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 13 నుంచి 19 వరకు హీట్వేవ్ కండీషన్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని స్పష్టం చేసింది. అయితే మధ్య భారతంలో మాత్రం ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయని పేర్కొంది. హీట్వేవ్ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. జూన్ వరకు పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని పేర్కొంది. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ్లల్లో బయటకు రావొద్దని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.