ఆదిలాబాద్టౌన్ (తలమడుగు), వెలుగు : పంట దిగుబడి రాదేమోనన్న మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సోమవారం జరిగింది. తలమడుగు ఎస్సై రాధిక తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి ప్రేమేందర్ (43) తనకున్న 28 గుంటల భూమితో పాటు మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో.. దిగుబడి రాదేమోనని మనస్తాపానికి గురయ్యాడు. పంట సాగు కోసం చేసిన రూ. ఐదు లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురైన ప్రేమేందర్ సోమవారం ఉదయం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా.. ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
