ఐసీసీ ఈవెంట్లలో భారత తడబాటుపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా మేల్కొని దృష్టి సారించాలని వెటరన్ క్రికెటర్లు అంటున్నారు. తాజాగా వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కర్ట్ ఆంబ్రోస్ కూడా ఐసీసీ టోర్నీ కీలక మ్యాచ్ల్లో టీమిండియా పెర్ఫామెన్స్ సరిగ్గా లేదని వ్యాఖ్యానించాడు. భారత్ సరికొత్త ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకె
ళ్లాలని సూచించాడు.
‘గత ఆరు నుంచి ఏడు ఐసీసీ ఈవెంట్లలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్లో టీమిండియా విఫలమైంది. కీలక మ్యాచుల్లో భారత్ వరుసగా ఫెయిల్ అవుతోంది. ఇలాంటి మ్యాచుల్లో గేమ్ ప్లాన్ మార్చడం ద్వారా టీమిండియా ఒత్తిడిలో పడుతోంది. ఇది సరికాదు. మనకు విజయాన్ని అందించిన వ్యూహాలను అనుసరించడంలో తప్పేం లేదు. అవి మంచి ఫలితాలను ఇస్తాయనేది నా నమ్మకం. అవే వ్యూహాలను ఫాలో అవుతూ, అదే ఆటతీరును కొనసాగిస్తే మరింత మెరుగైన ఫలితాలను రాబట్టొచ్చు. అక్కడే భారత్ ఓడిపోయింది. ఇన్నేళ్లుగా విజయాలను అందిస్తున్న ఆటతీరు, గేమ్ ప్లాన్ను పక్కనపెట్టడం వారి కొంపముంచింది’ అని ఆంబ్రోస్ పేర్కొన్నాడు.