కరీంనగర్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు వినతులు వెల్లువలా వచ్చాయి. కరీంనగర్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొని 379 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
సిటీలో రూ.3.6 కోట్లతో 30 జిమ్ములు నిర్మించారని, అవి ప్రస్తుతం పనిచేయడం లేదని కాంగ్రెస్ లీడర్ అనంతుల రమేశ్ ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 31 ఫిర్యాదులను అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలతో కలిసి స్వీకరించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు డిసెంబర్ 31 తుది గడువుగా కాకుండా, ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పొడిగించాలని భారత్ సురక్ష సమితి లీడర్లు ఫిర్యాదు చేశారు.
జగిత్యాల పట్టణంలోని 9వ వార్డులో కోతుల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ కార్యదర్శి గడ్డల లక్ష్మి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా, ఎరువుల కొరత లేదని, సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతి రోజు మండల ప్రత్యేక అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు, డివిజన్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి 146 వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత పాల్గొన్నారు.
