జహీరాబాద్ స్మార్ట్ సిటీకి టెండర్లు

జహీరాబాద్ స్మార్ట్ సిటీకి టెండర్లు
  • 27వ తేదీలోపు బిడ్లు దాఖలు చేయాలని టీజీఐఐసీ సర్క్యూలర్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ – నాగ్​పూర్ ఇండస్ట్రియల్ కారిడార్​లో భాగంగా కేంద్రం జహీరాబాద్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయనున్నది. అందులో భాగంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) తాజాగా జహీరాబాద్ స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్​పీ)ని ఆహ్వానించింది. రూ.1,206 కోట్లతో ఈ స్మార్ట్​ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఈ నెల 27వ తేదీలోపు బిడ్లను దాఖలు చేయాలని సర్క్యులర్​లో టీజీఐఐసీ పేర్కొన్నది.

 ఈ నెల 6న ప్రీబిడ్ మీటింగ్​ను నిర్వహించనున్నది. కాగా, జహీరాబాద్ స్మార్ట్ సిటీని 3,245.48 ఎకరాల్లో నిర్మించనున్నారు. అందులో ఇండస్ట్రీల కోసమే ఎక్కువ భూమి వినియోగించనున్నారు. 1939.40 ఎకరాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయనున్నారు. ట్రాన్స్​పోర్ట్ కోసం 55 ఎకరాలు, గ్రీనరీ కోసం 606.82 ఎకరాలు, నివాస సముదాలు, సెటిల్మెంట్ల కోసం 12.94 ఎకరాలు, వివిధ సేవల కోసం 83.77 ఎకరాలు, రోడ్లకు 433.50 ఎకరాలు, పబ్లిక్ ప్లేసెస్​కు 29.02 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 71.73 ఎకరాలు, చెరువు కోసం 13.30 ఎకరాలను వినియోగించనున్నారు.