ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు

 ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు
  • జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
  • విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు యధావిధిగా జరుగుతున్నాయని తెలిపారు. పరీక్షలు మళ్లీ వాయిదా పడతాయంటూ కొంత మంది అడుగుతూ.. ప్రచారం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. పరీక్షల షెడ్యూల్ లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. నెలాఖరులో.. లేదా వచ్చేనెల మొదటి వారంలోపు సీఎం జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష చేస్తారని చెప్పారు. విద్యార్థులకు ఆరోగ్యంతోపాటు మంచి భవిష్యత్ అందించాలన్న నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కరోనాను బట్టి నిర్ణయం తీసుకుంటామని.. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని వివరించారు. విద్యార్థులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు సన్నద్ధం కావాలని మంత్రి సూచించారు.