బుర్కినా ఫాసో: మార్కెట్పై ఉగ్రవాదులు చేసిన దాడిలో 36 మంది పౌరులు చనిపోయిన ఘటన బుర్కినా ఫాసోలో జరిగింది. ఆఫ్రికా దేశానికి ఉత్తరాన ఉన్న సన్మతెంగ ప్రావిన్స్లోని మార్కెట్పై సోమవారం ఉగ్రవాదులు చేసిన దాడిలో 36 మంది పౌరులు మరణించినట్లు బుర్కినాబే ప్రభుత్వం తెలిపింది. నాగ్రగో గ్రామంలోని మార్కెట్పై సాయుధ ఉగ్రవాదులు దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు.
‘సోమవారం, నాగ్రగోలోని ఒక మార్కెట్లోకి సాయుధ ఉగ్రవాదుల బృందం చొరబడింది. అక్కడ 32 మంది పౌరులను చంపి మార్కెట్ను తగలబెట్టారు. తిరిగి వెళ్లే దారిలో అలమౌ గ్రామంలో మరో నలుగురిని చంపారు. ఈ దాడులలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు’అని ప్రభుత్వం తెలిపింది. అమాయక పౌరులపై ఇటువంటి దాడులు పదేపదే జరుగుతున్నాయి. ఇప్పటికైనా రక్షణ మరియు భద్రతా దళాలు పరస్పర సహకారంతో ఉగ్రవాదుల్ని అరికట్టాలి అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ కబోర్ ఈ సంఘటన తర్వాత రెండు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకోలేదు.
గతంలోనూ దేశంలోని తూర్పు మరియు ఉత్తర ప్రాంతాలలో ఇస్లామిస్ట్ దాడుల వల్ల డజన్ల కొద్దీ బుర్కినాబే పౌరులు మరియు సైనికులు చనిపోయారు. బుర్కినా ఫాసో యొక్క ఉత్తర భాగం 2016 నుండి అల్-ఖైదా మరియు ఐసిస్ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలతో అట్టుడుకుతుంది. డిసెంబర్ 2019లో బుర్కినాలో జరిగిన ఉగ్రవాద దాడికి కనీసం 35 మంది పౌరులు మరణించారు.
For More News..