వెయిట్ లాస్ టాబ్లెట్స్ వేసుకుని లేడీ జిమ్ ట్రైనర్ మృతి

వెయిట్ లాస్ టాబ్లెట్స్ వేసుకుని లేడీ జిమ్ ట్రైనర్ మృతి

నాజూకుగా కనిపించాలన్న ఆశతో ఓ యువతి చేసిన పని తన ప్రాణాన్ని మింగేసింది. వేగంగా బరువు తగ్గడం కోసం టాబ్లెట్లు వేసుకోవడంతో అవి వికటించి కొద్ది గంటల్లోనే మరణించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది.

థానేకు చెందిన మేఘన దేవ్‌గడ్కర్ (22) అనే యువతి ఓ డాన్సర్. ఫిట్‌నెస్ కాపాడుకోవడం కోసం వర్కౌట్స్ చేసేది. రెండు నెలల క్రితమే ఆమె ఓ జిమ్‌లో ట్రైనర్‌గా కూడా చేరింది. ఆమె వేగంగా బరువు తగ్గడం కోసం నిషేధిత వెయిట్ లాస్ టాబ్లెట్లు వేసుకుంది. జిమ్‌లో వర్కౌట్‌కు ముందు డినిట్రోఫెనాల్ టాబ్లెట్ వేసుకున్న కొద్దిసేపటికే వాంతులు మొదలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

మేఘనకు కొద్ది నిమిషాల్లో శరీర ఉష్ణోగ్రత భారీగా పెరిగిపోయింది. హైపర్ థర్మియా అనే స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమె ను నార్మల్ స్థితిలోకి తెచ్చేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీపీ పెరిగిపోయి, హార్ట్ బీట్ అబ్‌నార్మల్‌గా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసే ప్రయత్నం చేశారు. కానీ హార్ట్ ఫెయిల్ అవడంతో మేఘన మరణించింది. ఈ ఘటనపై పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత టాబ్లెట్లు ఆమెకు ఎలా వచ్చాయన్న దానిపై అన్ని కోణాల్లో ఎక్వైరీ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిందా? లేక ఏదైనా షాపులోనే నేరుగా తీసుకుందా అన్న దానిపై విచారిస్తున్నారు.
మేఘన మరణంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తన సోదరి చాలా ఫిట్‌గా ఉంటుందని, ఆమెకు ఈ నిషేధిత డ్రగ్స్ ఎవరు ఇచ్చారో తెలియదని అన్నారు మేఘన అన్న భవేశ్ దేవ్‌గడ్కర్. బ్యాన్ చేసిన టాబ్లెట్లను సర్క్యులేషన్‌లో పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఆ టాబ్లెట్లు తీసుకున్న తర్వాత 15 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయిందని తెలిపాడు.