Delhi liquor scam : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ వాయిదా

Delhi liquor scam : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ వాయిదా

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఈడీ అధికారులు అభిషేక్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. 

మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్షీట్ను విచారణకు స్వీకరించడంపై ఈనెల 28న నిర్ణయం తీసుకుంటామని సీబీఐ స్పెషల్ కోర్టు తెలిపింది. శుక్రవారం దాఖలు చేసిన 13,567 పేజీల చార్జ్ షీట్​లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై అభియోగాలు మోపినట్లు ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ వివరించారు. ఇందులో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్, బిజినెస్ మెన్ బినోయ్ బాబు, అమిత్ అరోరా పేర్లను ప్రస్తావించినట్లు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.