
ముంబై డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఫ్యామిలీ నుంచి కేపీ గోసావి అనే సాక్షి సుమారు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సీబీఐ అధికారులు తమ విచారణలో తేల్చారు. క్రూయిజ్లో డ్రగ్స్తో దొరికిన ఆర్యన్ ఖాన్పై కేసు పెట్టకుండా ఉండేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ సమీర్ వాంఖడే రూ.25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. సీబీఐ ఇటీవల ఆ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
2021, అక్టోబర్ 2న కార్డెలియా క్రూయిజ్ షిప్లో ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేశారు. ఆ క్రూయిజ్లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు ఆరోపణలు రావడంతో దానిపై నార్కోటిక్స్ పోలీసులు దాడి చేశారు. అయితే... ఈ కేసులో సమీర్ వాంఖడేపై ఆరోపణలు రావడంతో శుక్రవారం (మే 12వ తేదీన) సీబీఐ అధికారులు సుమారు 29 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ముంబై, ఢిల్లీ, రాంచీ, లక్నో, గౌహతి, చెన్నై నగరాల్లోనూ తనిఖీలు చేశారు.
2008 ఐఆర్ఎస్ ఆఫీసర్ వాంఖడేతో పాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్సీబీ సూపరింటెండెంట్ విశ్వ విజయ్ సింగ్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అశిశ్ రంజన్, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు కేపీ గోసావి, సాన్విల్ డిసౌజా ఉన్నారు. 120-బీ ఐపీసీ, 388 ఐపీసీ కింద కేసులు బుక్ చేశారు. ఎన్సీబీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవినీతి కేసు కూడా నమోదైంది.