
- ఈ నెలలోనే అమల్లోకి!
- పాలసీకి తుది మెరుగులు దిద్దుతున్న ప్రభుత్వం
- మరింత విస్తరించనున్న ఈవీ ఎకోసిస్టమ్
- పాలసీపై ఫీడ్ బ్యాక్ ఇవ్వడం జూన్5 తోనే ముగిసింది
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతోంది. ఈ నెలలోపే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీలను మార్చుకునే) పాలసీని ఫైనలైజ్ చేయనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో బ్యాటరీ స్వాపింగ్ పాలసీ గురించి ప్రభుత్వం మొదటిసారిగా ప్రస్తావించింది. ఈ పాలసీపై ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కిందటి నెల 5 వరకు టైమ్ ఇచ్చింది. దేశంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా విస్తరించకపోవడం ఈవీ ఎకోసిస్టమ్ పెరుగుదలకు పెద్ద అడ్డంకిగా ఉంది. అదే బ్యాటరీ స్వాప్ పాలసీతో ఈ సమస్యను పరిష్కరించొచ్చని నిపుణులు చెబుతున్నారు. నిమిషాల్లోనే బ్యాటరీలను మార్చుకునే వీలుండడంతో ఈవీ ఎకోసిస్టమ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
బ్యాటరీ స్వాపింగ్ పాలసీలో ఏముండొచ్చు?
టూవీలర్లు, త్రీవీలర్ల కోసం మొదట ఈ పాలసీని అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పాలసీ ప్రకారం, కస్టమర్లు బ్యాటరీ లేకుండానే ఎలక్ట్రిక్ వెహికల్స్ను కొనుక్కోవచ్చు. దీంతో ఖర్చు తగ్గుతుంది. బ్యాటరీని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లలో సబ్స్క్రిప్షన్ మోడల్లో తీసుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోతే ఈ స్టేషన్ల దగ్గరకు వెళ్లి పాత బ్యాటరీని ఇచ్చి ఛార్జింగ్ ఫుల్గా ఉన్న బ్యాటరీని తీసుకోవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేయకుండానే బ్యాటరీని పొందడానికి వీలుంటుంది. ఇంక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల అవసరం బాగా తగ్గిపోతుంది. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీలను నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ బ్యాటరీలతో భర్తీ చేసుకోవడానికి వీలు దొరుకుతుండడంతో దేశంలో ఈవీ ఎకోసిస్టమ్ మరింత పెరుగుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు.
సేఫ్టీకి రూల్స్...
ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటిలో వాడుకునేలా ఉండేందుకు బ్యాటరీ సైజును ప్రభుత్వం స్టాండర్డయిజ్ చేయనుంది. అంటే బ్యాటరీ తయారీ కంపెనీలు ఒకే సైజులోని బ్యాటరీలను తయారు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ బ్యాటరీలను అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) ను ఉపయోగించి తయారు చేయాలి. లేదా ఇంతే స్థాయిలో కెపాసిటీ ఉన్న కెమికల్స్తో తయారు చేయాలని బ్యాటరీ స్వాపింగ్ డ్రాఫ్ట్ పేపర్స్ వెల్లడించాయి. ఇంకా ప్రభుత్వం తెచ్చిన ఫేమ్–2 రూల్స్ ప్రకారం బ్యాటరీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈవీ ఫైర్ యాక్సిడెంట్స్ ఇష్యూని బ్యాటరీ స్వాపింగ్ సిస్టమ్ పరిష్కరిస్తుందని ఎనలిస్టులు
అంచనావేస్తున్నారు.