ఇద్దరు చైనీయులు సహా 10 మంది అరెస్ట్
యాప్స్ క్రియేట్ చేసి, వాట్సాప్లో సర్క్యులేట్ చేసి మోసం
వెయ్యి పెట్టుబడితో రెట్టింపు లాభాలంటూ మెసేజ్లు
చైనా దేశస్తులదే మాస్టర్ మైండ్ అన్న పోలీసులు
ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.903 కోట్లు చైనాకు తరలింపు
నిందితుల్లో ముగ్గురు హైదరాబాదీలు
హైదరాబాద్, వెలుగు : పెట్టుబడుల పేరుతో రూ.10 వేల కోట్లు కొట్టేసిన సైబర్ ఫ్రాడ్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. కొట్టేస్తున్న డబ్బును చైనాకు తరలిస్తున్న హవాలా గ్యాంగ్ను బుధవారం అరెస్ట్ చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చైనా దేశస్తులు, హైదరాబాద్కు చెందిన ముగ్గురు, ముంబై, ఢిల్లీకి చెందిన మరో ఐదుగురిని రిమాండ్కి తరలించారు. రూ.1.91 కోట్లు ఫ్రీజ్ చేశారు. 17 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, రెండు పాస్ పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు రూ.10 వేల కోట్లు కొట్టేసినట్లు, అందులో రూ.903 కోట్లు చైనాకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాయింట్ సీపీలు ఏఆర్ శ్రీనివాస్, గజరావ్ భూపాల్, ఏసీపీ కెవీఎం ప్రసాద్తో కలిసి సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ను ఛేదించామని ఆయన తెలిపారు.
చైనా అడ్డాగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్..
చైనాకు చెందిన పెయ్, జహుయాన్ 2019 నుంచి రెండేండ్ల పాటు ఢిల్లీలో ఉన్నారు. తైవాన్కు చెందిన చు చున్ యు ఢిల్లీ కరోల్బాగ్లో సెల్ ఫోన్ షాప్ నిర్వహిస్తూ దందా చేస్తుండేవాడు. వీరు స్థానికంగా చైనీస్ భాష తెలిసిన వీరేంద్రసింగ్, సంజయ్కుమార్ యాదవ్లతో కాంటాక్ట్ అయ్యాడు. క్సిండై టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెటెంక్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను రిజిస్టర్ చేశారు.
వీటికి డైరెక్టర్లుగా వీరేంద్రసింగ్, సంజయ్ కుమార్లను నియమించారు. రెండు బ్యాంక్ అకౌంట్లను వీరితో ఓపెన్ చేయించారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో మనీ ట్రాన్సాక్షన్స్ చేసేలా సెటప్ చేశారు. యాప్స్ క్రియేట్ చేసి, వాటి లింకుల సర్క్యులేషన్, మనీ ట్రాన్స్ఫర్స్ గురించి వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, పెయ్, జహుయాన్ తిరిగి చైనాకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే మొత్తం ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు.
హవాలా ద్వారా విదేశాలకు..
కొట్టేసిన డబ్బును100కు పైగా అకౌంట్స్ నుంచి ఢిల్లీలోని రంజన్ మనీ కార్ప్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫారిన్ ఎక్స్చేంజ్లకు ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇండియన్ రూపీని డాలర్గా కన్వర్ట్ చేసి, చైనాకు మనీ లాండరింగ్ ద్వారా పంపించేవారు. ఇలా 7 నెలల్లో రంజన్ కార్ప్ నుంచి రూ.441 కోట్లు, కేడీఎస్ నుంచి 38 రోజుల్లో రూ.462 కోట్లు చైనాకు తరలించారు. ఇందుకోసం ఢిల్లీకి చెందిన సాహిల్, సన్నీ అలియాస్ పంకజ్ మరికొంత మంది కలిసి హవాలా డబ్బును విదేశాలకు తరలించారు. దేశవ్యాప్తంగా ఏడాదిన్నరలో సుమారు రూ.10 వేల కోట్లు కొట్టేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
64 ఖాతాలతో లావాదేవీలు..
సంజయ్ కుమార్ ఓపెన్ చేసిన అకౌంట్స్ను చైనాలోని లిజహానౌ కంపెనీకి అందించాడు. వీరేంద్రసింగ్, సంజయ్ కుమార్తో పాటు దుబాయ్లోని ఇమ్రాన్ అనే వ్యక్తితో కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఇమ్రాన్తో పరిచయం ఉన్న హైదరాబాద్కు చెందిన సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీం బేగ్, మహ్మద్ ఫర్వేజ్లతో అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చినందుకు రూ.లక్ష కమీషన్గా తీసుకున్నారు.
మొత్తం బ్యాంక్ 64 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. వీటితో లింకైన సిమ్ కార్డులను కొరియర్స్ ద్వారా కంబోడియాకు పంపించారు. వర్చువల్ అకౌంట్స్తో ఆన్లైన్ యాప్స్ క్రియేట్ చేశారు. కంబోడియా నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో లింకైన యాప్స్, బ్యాంక్ అకౌంట్లను ఆపరేట్ చేశారు. ఓటీపీలతో మనీ ట్రాన్స్ఫర్స్ జరిపారు. సంజయ్కుమార్ అందించిన ఒక్కో అకౌంట్కు రూ.1.2 లక్షలు, అకౌంట్ హోల్డర్స్కి ప్రతీ ట్రాన్సాక్షన్లో 0.2 శాతం కమీషన్ ఇచ్చారు.
ఇలా దొరికారు..
తార్నాకకు చెందిన బాధితుడికి 2 నెలల కింద వాట్సాప్లో లోక్సామ్ పేరుతో ఇన్వెస్ట్మెంట్ యాప్ లింక్ వచ్చింది. ఇందులో రూ.1,000 నుంచి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించారు. గ్రూపులో యాడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి పోస్టింగ్స్ చేశారు. అదే గ్రూపులో వివిధ నంబర్స్ నుంచి తమకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయని నమ్మించారు. దీంతో బాధితుడు ముందుగా రూ.2 వేలు డిపాజిట్ చేశాడు. ఈ క్రమంలోనే వర్చువల్ అకౌంట్ ద్వారా అతని డబ్బు రెట్టింపు అయినట్లు చూపించారు. ఇలా మొత్తం రూ.1.6 లక్షలు అతని నుంచి వసూలు చేశారు. ఈ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి, సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైనాకు చెందిన లిజహానౌ, చుచూన్ షెల్ కంపెనీల డైరెక్టర్లు వీరేంద్ర సింగ్, సంజయ్ యాదవ్లను అదుపులోకి తీసుకొని విచారించగా, ఢిల్లీలో ఫారిన్ ఎక్స్చేంజ్ నిర్వాహకుడు నవనీత్ కౌశిక్, హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఫర్వేజ్, సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీమ్ బేగ్లను అరెస్ట్ చేశారు.