- ఒక్కో పనికి.. ఒక్కో యాప్ .. స్మార్ట్ ఫోన్లోనే ఎలక్షన్ కమిషన్ పూర్తి సేవలు
- ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్
- ఓటు నమోదు, బదిలీకి ఓటర్ హెల్ప్ లైన్’
- 1950 నంబర్తో స్పెషల్ హెల్ప్లైన్ కాల్ సెంటర్
ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు ఎలక్షన్ కమిషన్ స్పెషల్ యాప్లు తయారు చేసింది. ఒక్కో ఇన్ఫర్మేషన్ కోసం.. ఒక్కో యాప్ను రూపొందించింది. దీంతో ఎన్నికల నిర్వహణ మరింత సులభం కానుంది. కొత్త ఓటర్ల నమోదు, ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్కు ఓటు బదిలీ, ఓటర్ల వివరాలు, ప్రలోభాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇలా ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఇంట్లోనే కూర్చుని స్మార్ట్ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఫోన్ యాప్, వెబ్సైట్ లేదా కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నది. కంప్లైంట్ చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ల వివరాలు గోప్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. పోలీసులకు, ఎన్నికల సర్వైలెన్స్ అధికారులకు, సాధారణ ప్రజలకు సమాచారం తెలిసేలా యాప్లు తయారు చేసింది. టెక్నాలజీతో మనీ పవర్ కంట్రోల్ చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఓటర్ హెల్ప్ లైన్ యాప్
ఓటుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు, కొత్త వివరాల నమోదుకు, ఆధార్ అనుసంధానికి ‘ఓటర్ హెల్ప్లైన్’ యాప్ ఉపయోగించుకోవచ్చు. మరికొన్ని ఆప్షన్లు కలిపి ఈసీ <https://voters.eci.gov.in> వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అప్లికేషన్ ఫామ్ ట్రాకింగ్, ఓటర్ కార్డు డౌన్లోడ్, ఎన్ఐఆర్ ఓటు రిజిస్ట్రేషన్ వంటివి ఈ వెబ్సైట్తో చేసుకోవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా నేషనల్ గ్రీవెన్సెస్ సర్వీస్ పోర్టల్ ను ఈసీ అందుబాటులోకి తెచ్చింది.
100 నిమిషాల్లోనే యాక్షన్
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులకైనా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. వాటన్నింటికీ ఓకే చెప్పిన తర్వాత మీ ఫోన్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. లేదా మీ వివరాలు గోప్యంగా ఉంచాలనుకుంటే అనానిమస్గా యాప్లోకి ఎంటర్ అవ్వొచ్చు. ఆ తర్వాత కంప్లైంట్ చేయొచ్చు. ఫిర్యాదుకు సంబంధించిన వీడియో, ఫొటో, ఆడియోలు కూడా అప్లోడ్ చేయొచ్చు. మీ ఫోన్లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది.
జియో ట్యాగింగ్, జియో లొకేషన్ ఆధారంగా కంప్లైంట్పై దగ్గర్లోని ఎన్నికల అధికారులు స్పందిస్తారు. 50 నిమిషాల్లోపు కంప్లైంట్ వచ్చిన స్థలానికి చేరుకోవాలని, కంప్లైంట్ వచ్చిన 100 నిమిషాల్లోపు యాక్షన్ తీసుకోవాలని రూల్స్ ఉన్నాయి. తగిన చర్య తీసుకోకుంటే.. సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకునేలా నిబంధనలున్నాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు.
కొత్త ఓటర్ల నమోదుకు లాస్ట్ చాన్స్
ఈ ఏడాది అక్టోబర్ 1 వరకు 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ లాస్ట్ చాన్స్ ఇచ్చింది. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది. అత్యధికంగా కొత్త ఓటర్ల నమోదులో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 44,204 మంది ఓటు నమోదు చేసుకున్నారు.