- ఇంగ్లండ్లో అంతా ఖుల్లా
లండన్: బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నా.. డైలీ కేసుల్లో ప్రపంచంలో టాప్లో ఉన్నా కరోనా ఆంక్షలు అన్నింటిని పూర్తిగా ఎత్తేసింది. సోమవారం నుంచి సోషల్ డిస్టెన్స్, మాస్కులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును రద్దు చేసింది. నైట్ క్లబ్లు, ఇతర ఇండోర్ వెన్యూలు అన్నింటినీ ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం సమర్థించుకున్నారు. ‘ఇప్పడు కాకపోతే ఇంకెప్పుడు? ఇదే కరెక్టు టైమ్. కానీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పారు. దేశంలో ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నారని.. ఇంకా వేసుకోని వారెవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని బోరిస్ సూచించారు.
జాగ్రత్తల్లేకుండా సడలింపులా?: ప్రతిపక్షాలు
సర్కారు నిర్ణయంపై ప్రతిపక్షాలు, సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ విమర్శలు చేస్తున్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా అన్నీ ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆంక్షలు సడలిస్తే ముప్పు కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న ఈ టైమ్లో ఇది తొందరపాటు చర్య అని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యుసన్ అన్నారు. దేశంలో తొందర్లోనే రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతాయన్నారు.