
గ్రూప్ 1, పోలీస్, హెల్త్లో ఖాళీల భర్తీకి కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. మరో నాలుగైదు రోజుల్లో మూడునాలుగు నోటిఫికేషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సుల భర్తీకి నోటిఫికేషన్లను ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్నూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు సర్కారు ఆదేశాలిచ్చింది. ఏజ్ లిమిట్ను 10 ఏండ్లు పెంచుతూ శనివారమే సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ వారంలోనే 20 వేల నుంచి 30 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తారని అధికారులు అంటున్నారు.
ఫస్ట్ నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే
పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త జోన్ల ప్రకారం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు.. ఆర్థిక శాఖ అనుమతిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ రిలీజ్ చేసేది పోలీస్ నోటిఫికేషనేనని అధికారులు అంటున్నారు. హోంశాఖలో 18,334 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అందులో 15 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చెప్పిందని అంటున్నారు. కానిస్టేబుల్ జిల్లా స్థాయి పోస్టు కావడంతో ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్, రోస్టర్, ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఈవెంట్స్పై సర్కారుకు పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హెల్త్, మెడికల్ డిపార్ట్మెంట్లో 12,755 ఖాళీలు ఉన్నాయి. వాటిలోనూ ఎక్కువగా నర్స్ పోస్టులే ఉన్నాయి. ఆ తర్వాత డాక్టర్, పారామెడికల్ సిబ్బంది తదితర ఖాళీలున్నాయి. కరోనా టైంలో కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సులు, ఇతర సిబ్బందిని తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిస్థాయిలో రిక్రూట్మెంట్కు సిద్ధమవుతోంది.
టెట్ అయ్యాకే టీచర్ కొలువులు
సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ఎడ్యుకేషన్, గురుకులాలు కలిపి 27 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలంటే టెట్ తప్పనిసరి కావడంతో.. ముందుగా టెట్ నిర్వహించి ఆ తర్వాతే టీచర్ కొలువుల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అందులో భాగంగా రెండు రోజుల్లో టెట్కు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శనివారం సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్లో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టెట్ పెట్టడం వల్ల టీచర్ల భర్తీకి మూడు, నాలుగు నెలల టైం కలిసి వస్తుందని సర్కారు భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు, తెలంగాణ వచ్చాక రెండుసార్లు టెట్ను నిర్వహించారు. టెట్ స్కోరుకు కాలపరిమితి ఏడేండ్లు కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్లకు ఇప్పటికే గడువు తీరిపోయింది. రాష్ట్రం వచ్చాక 2016 మేలో తొలిసారి, 2017 జులై 23న మరోసారి టెట్ పెట్టారు. అయితే, మళ్లీ టెట్ పెట్టాలంటూ టీచర్ కొలువుల కోసం ప్రయత్నిస్తున్న వారు డిమాండ్ చేస్తుండడంతో.. తాజాగా మరోసారి టెట్ నోటిఫికేషన్ను ఇవ్వనున్నారు. ఈసారి ఎక్కువ మంది టెట్కు అప్లై చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు.. ఎగ్జామ్ను ఆఫ్లైన్లోనే నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారు.