
- మన అధికారులకు హక్కులే లేవన్నట్టుగా వ్యవహారం
- ఈఎన్సీ స్థాయి అధికారి మాటకూ విలువివ్వని బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేశన్
- ఉద్యోగుల డిప్యూటేషన్ మన అధికారమే అయినా.. పట్టించుకోవట్లే
- ఓ సూపరింటెండెంట్ డిప్యూటేషన్ పొడిగించాలని ఈఎన్సీ లేఖ రాసినా నిర్లక్ష్యం
- ఉద్యోగులపై వేధింపులకు సంబంధించి అతీగతీ లేని కమిటీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పెత్తనం చెలాయిస్తున్నది. డిప్యూటేషన్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు తదితర విషయాల్లో మన రాష్ట్ర హక్కులను తొక్కేస్తున్నది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మన ఉన్నతాధికారులకు హక్కులే లేవన్నట్టుగా వ్యవహరిస్తున్నది. బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేశన్ తానే సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ మహిళా అధికారి డిప్యూటేషన్ పొడిగింపుపై ఈఎన్సీ (అడ్మిన్) లేఖ రాస్తే.. అసలు ఆ అర్హతే ఈఎన్సీకి లేదన్నట్టుగా అళగేశన్ మన అధికారులకు లేఖ రాశారు.
తాజాగా బోర్డులో ఓ సూపరింటెండెంట్ డిప్యూటేషన్ పూర్తవగా.. ఆయన మరో ఏడాదిపాటు ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఈఎన్సీ అడ్మిన్ ఈనెల 13న బోర్డుకు లేఖ రాశారు. మరో అధికారిని డిప్యూటేషన్ మీద పంపే వరకు వేచిచూడాలని, అప్పటి వరకు ఆ అధికారిని కొనసాగించాలని లేఖలో కోరారు. కానీ, బోర్డు మెంబర్ సెక్రటరీ మాత్రం.. ఈఎన్సీ (అడ్మిన్) లేఖనుగానీ, విజ్ఞప్తినిగానీ పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండానే.. ఆ సూపరింటెండెంట్ స్థానంలో వేరే అధికారిని నియమించారు. మన ఈఎన్సీ లేఖ రాసిన రెండు రోజులకే అంటే ఈనెల 15న ఓ మహిళా అధికారిని నియమిస్తూ ఈఎన్సీకి లేఖ పంపారు. ఉద్యోగుల డిప్యూటేషన్పై మనకు ఎలాంటి అధికారం లేదన్నట్టుగా అళగేశన్ తీరుందని అధికారులు వాపోతున్నారు.
రాష్ట్రాలకే హక్కు..
రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ఇతరత్రా వివాదాలపై మధ్యవర్తిగా ఉండేందుకు వీలుగా కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి కేంద్రం రెండు బోర్డులనూ నియమించింది. చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మెంబర్లను కేంద్రం నియమిస్తుంది. అందులో ఉద్యోగులను మాత్రం రెండు రాష్ట్రాలూ సమానంగా కేటాయించాల్సి ఉంటుంది. ఎవరిని బోర్డులకు పంపించాలన్నది పూర్తిగా రాష్ట్రాలకే కేంద్రం వదిలేసింది. కానీ, జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ అళగేశన్ మాత్రం ఆ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎన్సీ స్థాయి అధికారి లేఖలు రాసినా పట్టించుకోకుండా.. కర్రపెత్తనం చెలాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర అధికారులను టార్గెట్ చేసుకుని వేధింపులకూ పాల్పడుతున్నారని ఆయనపై ఫిర్యాదులు కూడా చేశారు.
కమిటీ ఊసే లేదు..
అళగేశన్పై గతంలోనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మహిళా ఉద్యోగులను టార్గెట్గా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దానిపై గతంలో బోర్డు చైర్మన్ దృష్టికీ తీసుకెళ్లారు. ఇటు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికీ ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. గత నెలలో జరిగిన బోర్డు మీటింగ్లో ఈ వ్యవహారంపై చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఇంటర్నల్ విచారణ కోసం కమిటీ వేస్తామని చైర్మన్ చెప్పారు. కానీ, ఇప్పటి వరకు బోర్డు చైర్మన్ కమిటీ వేయలేదు. ఇటు కేంద్రం కూడా ఆ వ్యవహారాన్ని చూసీచూడనట్టు వదిలేసింది. దీంతో అళగేశన్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తననెవరూ అడ్డుకోలేరన్న ధీమాతో అళగేశన్ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆయన వ్యవహారంపై సీరియస్గా దృష్టి పెట్టాలని, ఇకపై ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.