కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​కు మరోసారి హ్యాండిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​కు మరోసారి హ్యాండిచ్చిన రాష్ట్ర  ప్రభుత్వం
  • కాంట్రాక్ట్​.. రెగ్యులర్​ కాలే 
  • ఈనెల 1నుంచి చేస్తామన్న ప్రభుత్వం
  • నేటికీ విడుదల కాని గవర్నమెంట్​ ఆర్డర్స్​ 
  • రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది ఎదురుచూపు 
  • హెల్త్, ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్లలోనే 8వేల మంది 
  • తమను సర్కార్​ ఏప్రిల్​ ఫూల్స్​ చేసిందని ఆవేదన

మంచిర్యాల, వెలుగు : రెగ్యులరైజేషన్​ కోసం  ఏడేండ్లుగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​కు  రాష్ర్ట ప్రభుత్వం మరోసారి హ్యాండిచ్చింది. రాష్ర్టవ్యాప్తంగా వివిధ డిపార్ట్​మెంట్లలో పనిచేస్తున్న 11 వేల మందిని ఏప్రిల్​1న రెగ్యులరైజ్​ చేస్తామని ఫిబ్రవరి 6న అసెంబ్లీ  బడ్జెట్​ సెషన్స్​లో ప్రకటించింది.  తమ 20 ఏండ్ల కల నెరవేరనుందని కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ ఖుషీ అయినప్పటికీ మళ్లీ నిరాశే మిగిలింది.  నేటికి పదో తారీఖు వచ్చినా ప్రభుత్వం రెగ్యులరైజేషన్​ ఆర్డర్స్​ రిలీజ్​ చేయకుండా తమను ఏప్రిల్ ఫూల్​ చేసిందని మండిపడుతున్నారు. గవర్నమెంట్​ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

బడ్జెట్​ లెక్కలే కారణమా...? 

రాష్ర్ట ఆర్థిక పరిస్థితి  కొన్నేండ్ల నుంచి రోజురోజుకూ దిగజారుతోంది. ఖజానా ఖాళీ కావడంతో రెగ్యులర్​ ఎంప్లాయీస్​కు నెలనెలా జీతాలు చెల్లించడానికే సర్కారు తిప్పలు పడుతోంది. ఆయా డిపార్ట్​మెంట్ల వారీగా 20వ తారీఖు దాకా వేతనాలను  అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ను రెగ్యులరైజ్​ చేయడానికి సర్కారు సాహసించడం లేదని తెలుస్తోంది. 11వేల మంది ఎంప్లాయీస్​ జీతభత్యాలకు నెలకు రూ.380 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.4వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేసింది. ఈ కారణంగానే ప్రభుత్వం కుంటిసాకులు చెప్తూ కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ రెగ్యులరైజేషన్​ ప్రక్రియను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కాంట్రాక్ట్​ ఉద్యోగులు రెగ్యులర్​ ఎంప్లాయీస్​తో సమానంగా కష్టపడుతున్నప్పటికీ సమాన వేతనం పొందలేకపోతున్నారు. రెగ్యులర్​ ఎంప్లాయీస్​కు వచ్చే జీతంలో సగం, అంతకంటే తక్కువతోనే సరిపెట్టుకుంటున్నారు. పీఆర్సీ, టీఏ, డీఏలు, హెచ్​ఆర్​ఏ, రిటైర్​మెంట్​ బెనిఫిట్స్​, పెన్షన్​ వంటి అదనపు బెనిఫిట్స్ కు నోచులేకపోతున్నారు.  

కల నెరవేరకుండానే రిటైర్​మెంట్​..

కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ రెగ్యులరైజేషన్​ విషయంలో  సర్కారు  'ఒకడుగు ముందుకు... రెండడుగులు వెనక్కు' అన్నట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ప్రకటనలు చేయడం, కోర్టు కేసుల రూపంలో అడ్డంకులు రావడం పరిపాటిగా మారింది.  చివరకు లీగల్​ చిక్కులు తొలగిపోయి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసినప్పటికీ  రెగ్యులరైజేషన్​ ఆర్డర్స్​ రాకపోవడంతో కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ నారాజ్​ అవుతున్నారు. జీవో నంబర్​ 16 ప్రకారం రాష్ర్టవ్యాప్తంగా 11వేల మందికి గాను మెడికల్​ అండ్​ హెల్త్​, ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్లలోనే మెజారిటీ సంఖ్యలో కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ ఉన్నారు. జూనియర్​, డిగ్రీ, పాలిటెక్నిక్​ కాలేజీల్లో సుమారు 5వేల మంది, హెల్త్​ డిపార్ట్​మెంట్​లోని వివిధ విభాగాల్లో మరో 3వేల మంది ఉన్నారు.  గత 23 సంవత్సరాలుగా  రెగ్యులరైజేషన్​ కోసం ఎదురుచూస్తూ కొంతమంది రిటైర్​ అయ్యారు. మరికొందరు రిటైర్​మెంట్​కు దగ్గరలో ఉన్నారు. తమ కల నెరవేరకుండానే పలువురు వివిధ కారణాలతో చనిపోయారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది.. 

రాష్ర్టంలో కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ ఇక ఉండరని, అందరినీ రెగ్యులరైజ్​​ చేస్తామని సీఎం కేసీఆర్​ పలు సందర్భాల్లో ప్రకటించారు.  ఈ మేరకు 2016 ఫిబ్రవరి 26న ప్రభుత్వం రెగ్యులరైజేషన్​ జీవో నంబర్​ 16న రిలీజ్​ చేసింది. తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన 2014 జూన్​ 2కు ముందు పూర్తిస్థాయి కాంట్రాక్ట్​ పద్ధతిలో  నెలవారి పారితోషికాన్ని పొందుతున్న ఉద్యోగులను రెగ్యులైజ్​ చేయడానికి గైడ్​లైన్స్​ జారీ చేసింది. రాష్ర్టవ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి వివిధ డిపార్ట్​మెంట్లలో 11,103 మంది కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ పనిచేస్తున్నట్టు  లెక్క తేల్చింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో రెగ్యులరైజేషన్​ ప్రక్రియ ఆగిపోయింది. ఎట్టకేలకు నిరుడు డిసెంబర్​లో కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్​ సమావేశాల్లో ఏప్రిల్​ 1న కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ను రెగ్యులరైజ్​ చేస్తామని ప్రకటించింది.

సర్కార్​ ఏప్రిల్​ ఫూల్​ చేసింది... 

నేను ఇరవై ఏండ్ల నుంచి జూనియర్​ కాలేజీలో కాంట్రాక్ట్​ లెక్చరర్​గా పనిచేస్తున్నాను.  నాతో సమానఈ​ సర్వీస్​,  సీనియారిటీ ఉన్న రెగ్యులర్​ లెక్చరర్లకు రూ.లక్షకు పైగా వేతనం చెల్లిస్తుండగా,  నాకు మాత్రం రూ.50వేల లోపే వస్తోంది. నాలాగా ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​లో 5వేల మంది కాంట్రాక్ట్​ లెక్చరర్లు అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నారు.  రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 11 వేల కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ను ప్రభుత్వం ఏప్రిల్​ 1న రెగ్యులరైజ్​ చేస్తామని చెప్పి  మా అందరినీ ఏప్రిల్​ ఫూల్స్​ను చేసింది. 

- నరేందుల రవీంద్రకుమార్​, కాంట్రాక్ట్​ లెక్చరర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్,  మంచిర్యాల