మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని గోదావరి, మానేరుతో పాటు ఇతర నదుల్లోని ఇసుక రీచ్ల ద్వారా ఏటా వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న సర్కారు దానిపై స్థానిక సంస్థలకు వచ్చే రాయల్టీని తన ఖాతాలో వేసుకుంటోంది. దాదాపు మూడేండ్లుగా రాయల్టీ చెల్లించకపోవడంతో రాష్ర్టవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. గతంలో అన్ని రకాల మైనింగ్కార్యకలాపాలపై లోకల్బాడీస్కు రాయల్టీ వస్తుండగా ప్రభుత్వం వాటన్నింటిని రద్దు చేసి ఇసుకపై మాత్రమే చెల్లిస్తోంది. కొంతకాలంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, ఇసుక రాయల్టీ రాకపోవడంతో చిన్న చిన్న పనులు చేయాలన్నా ఫండ్స్ లేక స్థానిక సంస్థల ప్రతినిధులు పరేషాన్అవుతున్నారు.
సాండ్టాక్సీతో దండిగా ఆదాయం
ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వానికి సాండ్ పాలసీ అంటూ లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరిగినప్పటికీ అరకొర ఆదాయమే వచ్చేది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇసుక రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించింది. 2015 జనవరిలో సాండ్ టాక్సీ పాలసీ (ఆన్లైన్ బుకింగ్)ని తీసుకొచ్చింది. టీఎస్ఎండీసీ (తెలంగాణ స్టేట్మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా గోదావరి, మానేరు, మంజీరా, మూసీ, కృష్ణా నదులతో పాటు పట్టా భూముల్లో ఇసుక రీచ్లకు పర్మిషన్ ఇచ్చింది. ఈ రీచ్ల ద్వారా ఏటేటా ఇసుక అమ్మకాలు పెరుగుతూ, అదే స్థాయిలో ప్రభుత్వానికి రాబడి సైతం పెరిగింది. రాష్ర్టవ్యాప్తంగా 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 14 వరకు 9.47 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక రవాణాకు రూ.5,193 కోట్ల ఆదాయం సమకూరింది.
రాయల్టీ, డీఎంఎఫ్ ఇలా..
టీఎస్ఎండీసీ ద్వారా జరిగిన ఇసుక అమ్మకాలపై క్యూబిక్ మీటర్కు రూ.40 చొప్పున రాయల్టీ, దానిపై 30శాతం డీఎంఎఫ్ (డిస్ర్టిక్ట్ మినరల్ ఫండ్) చెల్లించాలి. కానీ ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయి. అందులో నుంచి రాయల్టీని టీఎస్ఎండీసీ ద్వారా మైనింగ్ డిపార్ట్మెంట్కు రిలీజ్ చేస్తే అక్కడి నుంచి జడ్పీ అకౌంట్లో జమ చేయాలి. ఇందులో జిల్లా పరిషత్లకు 25 శాతం, మండల పరిషత్లకు 50 శాతం, సంబంధిత గ్రామ పంచాయతీలకు 25 శాతం నిధులు కేటాయించాలి. కానీ మూడేండ్లుగా ఆ పని చేయడం లేదు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గోదావరిలో 40 లక్షల 42వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం 2020లో పర్మిషన్ఇచ్చింది.టీఎస్ఎం డీసీ 5 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున ఎనిమిది రీచ్లుగా విభజించి ఇసుక అమ్మకాలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 12 వరకు 28 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణా జరిగింది. స్థానిక సంస్థలకు రాయల్టీ క్యూబిక్ మీటర్పై రూ.40 చొప్పున రూ.11.20 కోట్లు, దీనిపై 30 డీఎంఎఫ్ కలిపి మరో రూ.3.36 కోట్లు.. మొత్తం రూ.14.56 కోట్లు రావాల్సి ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2020 మార్చి నుంచి ఇసుక అమ్మకాల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఈ జిల్లాలో అమ్మిన ఇసుకకు సంబంధించి రూ.30 కోట్ల రాయల్టీ నిధులు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంది.
