హైదరాబాద్, వెలుగు:కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న సర్కార్ ప్రకటనతో ఆ కేటగిరీలో పనిచేసే కొందరు ఉద్యోగులలో గుబులు మొదలైంది. ముఖ్యంగా డిస్టెన్స్ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వాళ్లలో భయం నెలకొంది. ఆ సర్టిఫికెట్లు చెల్లుతాయో లేదోననే అయోమయంలో ఉన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ గత నెలలో ప్రకటించారు. దీంతో ఎంతమంది అర్హులున్నారనే వివరాలను పంపించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఇటీవల లేఖ రాసింది. దీంతో ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్ల వివరాలను విద్యాశాఖ సేకరించింది. ఆయా డిపార్ట్మెంట్ల పరిధిలో కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి 15 అంశాలతో కూడిన డేటాను కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఇంటర్ కాలేజీల్లో ప్రిన్సిపల్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ల ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫై చేసి, డీఐఈవోలకు పంపించారు. ప్రస్తుతం కమిషరేట్లో మరోసారి వెరిఫికేషన్ జరుగుతోంది. రెండుమూడ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఇంటర్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లకు మినిమమ్ 50 శాతం మార్కులతో పీజీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ కాలేజీల్లో పనిచేసే వారికి నెట్, సెట్, పీహెచ్డీ ఉండాలి. దీంతో పాటు 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు పనిచేస్తున్న వారై ఉండాలనే నిబంధనలు ఉన్నాయి.
డిస్టెన్స్ సర్టిఫికెట్లే ఎక్కువ..
ఏపీలో కాంట్రాక్టు లెక్చరర్ల వ్యవస్థ 2000 సంవత్సరంలో మొదలైంది. 2007 వరకు ప్రిన్సిపల్స్ నేతృత్వంలో త్రిమెన్ కమిటీ వారిని ఎంపిక చేసేది. ఆ తర్వాత నుంచి ఆర్జేడీల ఆధ్వర్యంలో పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా నియామకాలు ఉండేవి. దీంతో ఎక్కువ మంది డిస్టెన్స్ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరారు. రెగ్యులర్ పీజీలున్నా వాటిలో తక్కువ మార్కులు ఉండటంతో, డిస్టెన్స్ సర్టిఫికెట్ల వైపు మొగ్గు చూపారు. కర్నాటక, బీహార్, తమిళనాడు, రాజస్థాన్, యూపీ, ఢిల్లీతో పాటు పలు యూనివర్సిటీల నుంచి డిస్టెన్స్సర్టిఫికెట్లు సంపాదించారు. వీరు రాష్ట్రంలోని ఆయా స్టడీ సెంటర్లలో చదివినట్టు చూపిస్తున్నారు. అయితే, ఆ స్టడీ సెంటర్లకు రాష్ట్రంలో పర్మిషన్ ఉందా? అవి సరైనవేనా, ఫేక్ సర్టిఫికెట్లా? అనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కొన్నిఫేక్ సర్టిఫికెట్లను గుర్తించినట్లు అధికారులు చెప్తున్నారు.
డిగ్రీలో పర్మినెంట్ అయ్యేది తక్కువే..
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 800 మందికి పైగా కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. మొదట్లో పీజీలో 55 శాతం మార్కులు ఉండాలనే నిబంధన ఉండేది. అయితే, 2009లో యూజీసీ నిబంధనలు మార్చింది. కాంట్రాక్ట్ లెక్చరర్లకు కచ్చితంగా నెట్, సెట్, పీహెచ్డీ ఉండాలని చెప్పింది. దీని కోసం కొంత సమయం కూడా ఇచ్చింది. అవి ఉంటేనే వారంతా రెగ్యులర్ అయ్యే అవకాశముంది. దీంతో యూజీసీ అర్హతలున్న వారు కేవలం 25 శాతం మంది ఉన్నారని అధికారులు చెప్తున్నారు. అయితే, తామంతా 2009 కంటే ముందే జాయిన్ అయ్యామని, కాబట్టి తమను రెగ్యులరైజ్ చేయాలని ఆయా లెక్చరర్లు సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క సర్కారు పాలిటెక్నిక్ కాలేజీల్లో 2014 తర్వాత జాయిన్ వారే ఎక్కువ మంది ఉండటంతో, ఇప్పుడు వారందరికీ రెగ్యులరైజ్కు అర్హత లేకుండా పోయింది.
వెరిఫికేషన్లో వెల్లడైన కొన్ని నిజాలు ..
హైదరాబాద్ ఫలక్నుమాలోని ఓ సర్కారు జూనియర్ కాలేజీలో ఉర్దూలో పీజీ సర్టిఫికెట్ లేకుండానే ఉర్దూ లెక్చరర్ పని చేస్తున్నాడు. -మహబూబ్నగర్ జిల్లాలోని సర్కారు కాలేజీలో డిప్లొమా క్వాలిఫికేషన్తో ఒకేషనల్ కోర్సులో కాంట్రాక్టు లెక్చరర్గా జాయిన్ కాగా, తర్వాత జార్ఖండ్ నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చిపెట్టాడు. 50 శాతం మార్కుల నిబంధన ఉండగా, హైదరాబాద్లోని ఓ కాలేజీలో ఇంకో కాంట్రాక్టు లెక్చరర్ పీజీలో 41 శాతం మార్కులతో జాయిన్ అయ్యాడు.