భార్య మరణం తట్టుకోలేక.. గంటల తేడాలో భర్త మృతి

భార్య మరణం తట్టుకోలేక.. గంటల తేడాలో భర్త మృతి

జోగిపేట/రాయికోడ్, వెలుగు: 50 ఏండ్లుగా కలిసి ఉన్న భార్య చనిపోవడంతో తట్టుకోలేక కొద్ది గంటలకే భర్త కూడా మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ముత్యాలవాడకు చెందిన గుడ్ల ఎల్లమ్మ(70) పక్షం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో మృతిచెందింది. భార్య మృతిచెందిన విషయాన్ని తట్టుకోలేక  భర్త గుడ్ల నర్సింలు(80) అదే రోజు రాత్రి 11 గంటలకు కూర్చున్నచోటే చనిపోయాడు. భార్యభర్తలిద్దరూ ఒకేరోజు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. 

ఖమ్మం జిల్లాలో కరోనాతో..

మధిర, వెలుగు: కరోనాతో భార్యాభర్తలిద్దరూ ఒకేరోజు మృతిచెందారు. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన బొల్లెపోగు వెంకటేశ్వర్లు(63), ద్వారక(58) వారం క్రితం కరోనా బారిన పడ్డారు. కుటుంబసభ్యులు వారిని మధిర పట్టణంలోని ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. డాక్టర్ల సూచనతో గురువారం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతోశుక్రవారం రాత్రి దంపతులిద్దరూ చనిపోయారు. ఒకేరోజు ఇద్దరూ చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.