
బొమ్మనపల్లి మర్డర్ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన నవ వధువు మర్డర్కేసు మిస్టరీ వీడింది. భర్తే అతి కిరాతకంగా భార్యను కత్తితో పొడిచి, గొడ్డలితో నరికి చంపినట్లు తేలింది. సీపీ కమలాసన్రెడ్డి సోమవారం కమిషనరేట్లో కేసు వివరాలు వెల్లడించారు. బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనిల్(26)కు హుజూరాబాద్కు చెందిన గరిగె ప్రవళ్లికతో రెండు నెలల క్రితం పెండ్లయ్యింది. అనిల్కు హుస్నాబాద్లో బ్యాటరీల రిపేరింగ్షాపు ఉంది. కాగా ప్రవళ్లిక తనకంటే ఎక్కువ చదువుకుందని, తరచూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందని అనిల్భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెండ్లయ్యాక వచ్చిన మొదటి ఆషాఢ మాసం కావడంతో ఇటీవల ప్రవళ్లిక పుట్టింటికి వెళ్లింది. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి అనిల్ ఈనెల18న భార్యను బొమ్మనపల్లికి తీసుకొచ్చాడు. 23న భార్యను హత్య చేయాలని ప్లాన్చేశాడు. రోజూ మాదిరిగానే 23న ఉదయం షాపుకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడి బైక్పై ఇంటికి వచ్చాడు. ఆ టైంలో ప్రవళ్లిక ఫోన్మాట్లాడుతూ ఉంది. భర్తను చూసి ఫోన్ కట్చేసి ఏమైనా పనిమీద వచ్చావా అని అడగడంతో అనిల్కు అనుమానం రెట్టింపు అయ్యింది. పని మీదే వచ్చానని చెప్పి లోపలికి వెళ్లాడు. భార్య మంచంపై పడుకొని ఫోన్ చూస్తుండగా టీవీ ఆన్చేసి ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడను కోశాడు. ఇద్దరూ పెనుగులాటలో మంచం మీద నుంచి కిందపడగా అనిల్ వెంటనే గొడ్డలితో నరికి చంపాడు.