హనుమకొండ, కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజెస్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. వీసీ తాటికొండ రమేశ్, స్పోర్ట్స్ బోర్డ్ఆఫీసర్లు చీఫ్ గెస్టులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రమేశ్ మాట్లాడుతూ.. ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ఆటలు ఉపయోగపడతాయన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో పోటీలు జరిగాయి. కాగా విమెన్ 1500 మీటర్ల పరుగు పందెంలో వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ ఎం.కావ్య మొదటి స్థానంలో నిలవగా.. ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీజీఎస్ఆర్ కాలేజీకి చెందిన షేక్ సమ్రీన్, మంచిర్యాల సీవీ రామన్ కాలేజీకి చెందిన జే.హనీ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. పురుషుల 1500 మీటర్ల విభాగంలో ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎస్ఆర్ కాలేజీకి చెందిన వి.రాజు, వి.జ్ఞానేశ్వర్ మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఆదిలాబాద్ మహర్షి కాలేజీ స్టూడెంట్ ఎస్.వంశీ మూడో స్థానం సాధించారు. 100 మీటర్ల మెన్ విభాగంలో మంచిర్యాల శ్రీవికాస్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్ పీఎస్ అభిలాష్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా.. మరిపెడ టీఎస్డబ్ల్యూఆర్డీ కాలేజీకి చెందిన విద్యార్థులు బి.రాము, బి.అనిల్ తర్వాత స్థానాల్లో నిలిచారు. మహిళల 100 మీటర్ల విభాగంలో ఖమ్మం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజీకి చెందిన వి.సంధ్య ప్రథమ స్థానంలో నిలవగా.. ఆదిలాబాద్ ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్ కె.జంగాబాయి, ఖమ్మం టీఎస్ డబ్ల్యూఆర్డీసీకి చెందిన టి.శ్రీవిద్య రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. గురువారం వివిధ విభాగాల్లో ఫైనల్ పోటీలు జరగనున్నాయి. క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.బి.సురేశ్ లాల్, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రెటరీ సవితా జ్యోత్స్న, ప్రొ.వి.రమేశ్ రెడ్డి, జి.సునీల్ రెడ్డి, ఎస్.కుమారస్వామి పాల్గొన్నారు.