గూడ్స్​పైనే ఆశ పెట్టుకున్న రైల్వే రంగం

గూడ్స్​పైనే ఆశ పెట్టుకున్న రైల్వే రంగం

ఇండియన్​ రైల్వేస్​ది  ప్రపంచంలోనే 4వ అతి పెద్ద నెట్​వర్క్​. సరుకు రవాణాలో పనితీరు ఆ రేంజ్​లో ఉండడం లేదు. నేషనల్​ గూడ్స్​ ట్రాన్స్​పోర్ట్​లో రైల్వేల వాటా 20 శాతమే. ఈ షేర్​ను 45 శాతానికి పెంచుతామని మన దేశం ప్రపంచ వేదికలపై హామీ ఇచ్చింది. ఆ మాటను నిలబెట్టుకోవటానికి ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ ఏడాది గూడ్స్​ రాబడిలో నెలకొన్న లోటును పూడ్చటానికి ఫాస్ట్​గా కదులుతోంది. మొత్తం సరుకు రవాణా విధానాన్నే మార్చనుంది. గూడ్స్​ బండ్లకు సరికొత్త బోగీలను రూపొందించనుంది.

మన దేశంలో రైల్వే రంగానికి సరుకు రవాణే ముఖ్య ఆదాయ మార్గం. గూడ్స్​ రవాణా ద్వారా వచ్చే మొత్తం రాబడిలో మేజర్​ షేరు (44 శాతం) బొగ్గుదే. ఆ తర్వాతి స్థానాల్లో సిమెంట్​ (8 శాతం), ముడి ఇనుము (8 శాతం), తిండి గింజలు (7 శాతం) ఉన్నాయి. ఈ సరుకును రైల్వేలు పెద్ద మొత్తంలో (బల్క్​గా) తరలిస్తుంటాయి. ఈ పాలసీ ఎప్పటినుంచో అమలవుతోంది. కానీ.. ఈ విధానం సరికాదని, ఇతర మెటీరియల్స్ రవాణా​కీ రైళ్లలో చోటివ్వాలని  ఇటీవల నిర్ణయించారు. కొన్ని సరుకులు గూడ్స్​కే​ పరిమితమవటం వల్ల ఆశించినంత ఆదాయం రావట్లేదని గుర్తించారు.

రెవెన్యూ టార్గెట్​ రీచ్​ కాలే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో మొత్తం 1,216 మిలియన్​ టన్నుల సరుకు రవాణా చేయాలని, తద్వారా లక్షా 43 వేల కోట్ల రూపాయల ఆదాయం రాబట్టాలని టార్గెట్​ పెట్టుకున్నారు. అయితే, ఏప్రిల్​–నవంబర్​ మధ్య కాలంలో రూ.71,800.20 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ.17,641.91 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటు అక్టోబర్​ చివరలో రూ.14,882.72 కోట్ల వద్దే ఉండగా నవంబర్ ఆఖరికి మరింత పెరిగింది. ఈ ఇన్​కం గ్యాప్ ఇంకా పెద్దది కాకుండా చూడటానికి వెంటనే చర్యలు చేపట్టారు.

బోగీల డిజైన్​ మార్చాలి

బల్క్​ గూడ్స్​ ట్రాన్స్​పోర్ట్​ వల్ల అంచనాలకు తగ్గట్లు ఆదాయం రాకపోవటంతో నాన్​–బల్క్​ ఐటమ్స్​ తరలింపునకూ రెడీ కావాలనే క్లారిటీకి వచ్చేశారు. అయితే నాన్​–బల్క్​ కమోడిటీలను రవాణా చేయాలంటే ఇప్పుడున్న వ్యాగన్లు అనుకూలం కాదని, వాటికి బదులు కొత్త డిజైన్​తో బోగీలు తయారుచేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం టోటల్​ రైల్​ ట్రాఫిక్​లో నాన్​–బల్క్​ ఐటమ్స్ వాటా దాదాపు 30 శాతం. ఇందులో ఒక్కో సెక్షన్ (కమోడిటీ) షేరు 10 శాతం కన్నా తక్కువే ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఎన్డీసీని పెంచాల్సిన పరిస్థితి

ప్రపంచ వేదికలపై మన దేశం కమిట్​ అయిన అంశాలను బట్టి చూస్తే ‘నేషనల్లీ డిటర్మైన్డ్​ కంట్రిబ్యూషన్స్​ (ఎన్డీసీ)’ని పెంచాల్సిన​ అవసరం ఏర్పడింది. దీనికోసం నేషనల్ గూడ్స్​ ట్రాన్స్​పోర్ట్​లో రైల్వేల వాటాను ప్రస్తుతం ఉన్న 20 శాతం నుంచి సుమారు 45 శాతానికి చేర్చాలి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో నాన్​–బల్క్​ కమోడిటీ సెగ్మెంట్​లో బిలియన్​ టన్నుల రవాణా జరగాలంటే ఫ్రీట్​ ట్రాఫిక్​ మూమెంట్​కు తెర తీయాలి. ఇది మొత్తం దేశానికి, రైల్వేలకు, ఎన్విరాన్​మెంట్​ సెక్టార్​కే సవాల్​ లాంటిదని రైల్వే మినిస్ట్రీ ఆఫీషియల్స్​ అంటున్నారు.

కొత్త కమోడిటీలపై ఫోకస్​

ఇండియన్​ రైల్వే ఇన్నాళ్లూ ఐరన్​ ఓర్​, కోల్, సిమెంట్​, ఫుడ్​ గ్రెయిన్స్ వంటి ట్రెడిషనల్​ ఐటమ్స్​ రవాణానే పట్టించుకుంది. ఇకపై ఫ్లైయాష్​, ఫినిష్డ్​ స్టీల్​ (స్టీల్​ కాయిల్స్​), ఆటోమొబైల్స్​, కంటెయినర్స్​, ఎఫ్​ఎంసీజీ తదితర కొత్త కమోడిటీలపైనా ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. స్టీల్​ ప్లాంట్లు, పవర్​, ఐరన్​ ఇండస్ట్రీలకు కావాల్సిన ముడి సరుకు తెచ్చివ్వడం,  అక్కడి ఫైనల్​ ప్రొడక్ట్స్​ని రవాణా చేయడాన్ని కొత్త టార్గెట్​లో చేర్చింది. దీనిద్వారా సరుకు రవాణాలో వస్తున్న రాబడి లోటును భారీగా తగ్గించాలని తీర్మానించుకుంది.  కొత్త కమోడిటీలతో కనీసం రూ.25 వేల కోట్లు గడించాలని అనుకుంటోంది.

కరెక్షన్​ కచ్చితంగా అవసరమే

ప్రస్తుతం రైల్వే రంగంలో నెలకొన్న పరిణామాలు ఒక రకంగా ప్రమాద హెచ్చరికను మోగిస్తున్నాయి. భవిష్యత్​లో బిలియన్​ టన్నుల లక్ష్యాన్ని చేరడానికి నాన్​–బల్క్​  కమోడిటీ సెక్షన్​లో లాజిక్​ సర్వీస్​ ప్రొవైడర్స్​కి ఎంతో స్కోప్​ ఉంది. దాన్ని వాళ్లు ఉపయోగించుకోవాలి. టోటల్ ఫ్రీట్​ మూమెంట్​లో 45 శాతం రైల్వేల ద్వారానే జరగాలి. అదే ఇప్పుడు అందరి ముందున్న మెయిన్​ ఎయిమ్​. డెడికేటెడ్​ ఫ్రీట్​ కారిడార్లు ఒక్కసారి పట్టాలెక్కితే మన రైల్వేలకు తిరుగుండదు. ‑ రాజేశ్​ అగ్రవాల్​, రైల్వే బోర్డ్​ మెంబర్​ రోలింగ్​ స్టాక్​ (ఎంఆర్​ఎస్​)