
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా8 గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమం తీవ్రమవుతోంది. రైతులు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రైతుల ఉద్యమంతో జిల్లాలో పొలిటీకల్ హీట్ కూడా పెరుగుతోంది. మాస్టర్ ప్లాన్ వ్యవహారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్లను టెన్షన్ పెడుతోంది. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ను 2022 నవంబర్ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ర్టియల్ జోన్, గ్రీన్ జోన్, రీక్రియేషన్ జోన్, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని అడ్లూర్, ఇల్చిపూర్, టెకిర్యాల్, లింగాపూర్, పాతరాజంపేట, రామేశ్వర్పల్లిలో పాటు సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన రైతులంతా రైతు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడ్డారు. 45 రోజులుగా ఆందోళనలు చేస్తునారు. జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్ పోగ్రాములు సక్సెస్ అయ్యాయి. దీంతో రైతుల ఉద్యమం రాష్ర్ట వ్యాప్తంగా చర్చగా మారింది. దీంతో అధికార పార్టీపై ముఖ్యంగా స్థానిక లీడర్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మరింత కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీంతో ఈ ఎమ్మెల్యేలు ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు.
పట్టున్న గ్రామాల్లోనే ఉద్యమం..
మున్సిపాల్టీలో విలీనమైన లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్, రామేశ్వర్పల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట గ్రామాలతో పాటు, సదాశివనగర్ లో బీఆర్ఎస్కు పట్టుంది. కానీ, మాస్టర్ ప్లాన్పై ఈ గ్రామాల నుంచే వ్యతిరేకత రావడంతో బీఆర్ఎస్ నాయకులు ఇరకాటంలో పడ్డట్టైంది. మాస్టర్ ప్లాన్ను కంప్లీట్గా రద్దు చేయించేందుకు ఒత్తిడి తెచ్చేందుకు కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తామని ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రామాలకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా మాస్టర్ ప్లాన్ను మారుస్తామని, డీటీసీపీ, కన్సల్టెన్సీ తప్పిదంతో మాస్టర్ ప్లాన్ వివాదానికి కారణమైందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. రైతు పయ్యావుల రాములు ఆత్మహత్యపై, కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళనపై ఎమ్మెల్యే జాజాల సురేందర్ కామెంట్లు తీవ్ర దుమారం లేపాయి. ఇలా రైతులు వ్యతిరేకిస్తున్న మాస్టర్ ప్లాన్ వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రైతులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలితం ఇవ్వడం లేదు.