మామల్లపురం: ఓవైపు కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంటే.. మరోవైపు ఇండియాలో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ జోష్ తారాస్థాయికి చేరుకుంది. ఈ మెగా ఈవెంట్కు ఇండియా తొలిసారి ఆతిథ్యమిస్తుండటంతో యావత్ దేశం టోర్నీపై ఎనలేని ఆసక్తి చూపెడుతున్నది. గురువారం నుంచి మొదలయ్యే ఈ పోటీలు వచ్చే నెల 10న ముగుస్తాయి. చైనా, రష్యా గైర్హాజరీతో ఈ మెగా టోర్నీ కోసం ఇండియా ఆరు టీమ్స్ (ఓపెన్లో మూడు, విమెన్లో మూడు)ను బరిలోకి దించుతున్నది. ప్రతి టీమ్లో 5 మంది చొప్పున 30 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పోటీలకు దూరంగా ఉన్న లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. ఓపెన్ సెక్షన్లో మొత్తం 188 టీమ్స్ ఉండగా, విమెన్స్లో 162 జట్లు పోటీలో ఉన్నాయి. టోర్నీ చరిత్రలో ఇన్ని జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. 2014 ట్రోమ్సో టోర్నీలో ఓపెన్ సెక్షన్లో ఇండియా బ్రాంజ్ నెగ్గింది. 2020 వర్చువల్ టోర్నీలో గోల్డ్ నెగ్గిన జట్టు 2021లో బ్రాంజ్తో సరిపెట్టుకుంది.
స్విస్ లీగ్ ఫార్మాట్లో..
మ్యాచ్లన్నీ స్విస్ లీగ్ ఫార్మాట్లోనే జరుగుతాయి. మొత్తం 11 రౌండ్లు ఉంటాయి. ఆగస్ట్ 4 రెస్ట్ డే. ఓపెన్, విమెన్ సెక్షన్స్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ను ఇస్తారు. ఆటగాళ్ల పెర్ఫామెన్స్ను బట్టి ఇండివిడ్యువల్ మెడల్స్ను కూడా అందజేస్తారు. మ్యాచ్లన్నీ చెన్నైకి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురంలోని షెరటాన్ రిసార్ట్లో మధ్యాహ్నం 3 నుంచి మొదలవుతాయి.
మనోళ్లు ఆరుగురు
ఈ టోర్నీలో పోటీపడే ఆరు జట్లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఓపెన్ సెక్షన్లో పాల్గొనే ఇండియా–1 టీమ్కు రెండో సీడ్ కేటాయించారు. ఇందులో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి, గ్రాండ్మాస్టర్లు పెంటేల హరికృష్ణ ఉన్నారు. విమెన్ సెక్షన్లో ఇండియా–1 (1వ సీడ్) టీమ్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఉండగా మూడో జట్టులో (16వ సీడ్)లో బొడ్డా ప్రత్యూష, 14 ఏండ్ల సాహితి వర్షిణికి చోటు దక్కింది.