పౌరసత్వ చట్టసవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారాయి. ఢిల్లీ భరత్ నగర్ ఏరియాలో నిరసనకారులు రెచ్చిపోయారు. బస్సులు, కార్లు, బైక్ లకు నిప్పు పెట్టారు. దీంతో వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు చల్లార్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఇద్దరు ఫైర్ సిబ్బందికి గాయాలయ్యాయి.
జామియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు కారణమైంది. విద్యార్థుల ర్యాలీలోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు అల్లర్లకు కారణమయ్యారని చెబుతున్నారు పోలీసులు. జంతర్ మంతర్ కు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లరి మూకలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఇదే సమయంలో బస్సులకు నిప్పు పెట్టారు. అల్లరి మూకలను అదుపుకు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. ఆ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. సుఖ్ దేవ్ విహార్ స్టేఫన్, జామియా ఇస్లామియా, ఓక్లా విహార్, జసోలా విహార్, ఆశ్రమ్ స్టేషన్ లో రైళ్ల హాల్టింగ్ ను రద్దు చేశారు. భరత్ నగర్ ఏరియాలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఢిల్లీలో ఉద్రిక్తతలపై స్పందించారు సీఎం కేజ్రీవాల్. ఎవరూ హింసకు పాల్పడవద్దని ట్విట్టర్ లో పిలుపునిచ్చారు కేజ్రీవాల్. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలన్నారు.